- మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్పై ఖర్చులు పెంపు
- బాక్స్ ఆఫీసులను మించి ఎస్వీఓడీ రెవెన్యూలు
ఓటీటీ ప్లాట్ఫామ్లు మన ఇండియాలో శరవేగంగా దూసుకెళ్తున్నాయి. వచ్చే నాలుగేళ్లలో ఇండియాను ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఓటీటీ మార్కెట్గా ఈ ప్లాట్ఫామ్లు నిలబెట్టబోతున్నాయి. వార్షికంగా Aఓటీటీ మార్కెట్ 28.6 శాతం వృద్ధి చెంది రూ.21,362 కోట్ల రెవెన్యూలను అందుకుంటుందని పీడబ్ల్యూసీ రిపోర్ట్ అంచనావేస్తోంది.
న్యూఢిల్లీ : అసలే వైరస్ భయం.. థియేటర్లు తిరిగి ఓపెన్ అయినా.. వాటికి వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపించకపోవడం… కొత్త సినిమాలన్ని ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లోనే విడుదలవడం… ఇవన్నీ ఇప్పుడు ఇండియాలో ఓటీటీ(ఓవర్ ది టాప్ స్ట్రీమింగ్) మార్కెట్ శరవేగంగా దూసుకెళ్లేందుకు సాయపడుతున్నాయి. ఇండియా ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతోన్న ఓటీటీ మార్కెట్గా ఉందని ప్రైస్వాటర్హౌస్కూపర్స్(పీడబ్ల్యూసీ) రిపోర్ట్ చెప్పింది. 2024 నాటికి ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఓటీటీ మార్కెట్గా ఇండియా అవతరిస్తుందని పేర్కొంది. వచ్చే నాలుగేళ్లలో ఈ మార్కెట్ వార్షికంగా 28.6 శాతం వృద్ధి చెంది, రూ.21,362 కోట్ల(2.9 బిలియన్ డాలర్ల) రెవెన్యూలను తాకుతుందని పేర్కొంది. ఓటీటీ వీడియోతో పాటు ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్, వీడియోగేమ్స్, ఈ–స్పోర్ట్స్, మ్యూజిక్, రేడియో అండ్ పాడ్కాస్ట్స్ టాప్ సెగ్మెంట్లుగా ఉన్నట్టు పీడబ్ల్యూసీ రిపోర్ట్ చెప్పింది. గ్లోబల్ పీడబ్ల్యూసీ రిపోర్ట్ 53 దేశాల్లో, 14 సెగ్మెంట్లను కవర్ చేసింది. ఈ సెగ్మెంట్లలో ట్రెడిషినల్ టీవీ, ఓటీటీ, సినిమా, ప్రింట్, బుక్స్, మ్యూజిక్ అండ్ రేడియో వంటివి ఉన్నాయి.
కన్జూమర్ ప్రవర్తనలో మార్పులు వస్తుండటంతో సినిమా, ప్రింట్ వంటి ట్రెడిషినల్ సెక్టార్లు ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటీటీ సబ్స్క్రిప్షన్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా ఖర్చులు, మొబైల్ డేటా అలవెన్స్లు బాగా పెరుగుతున్నట్టు రిపోర్ట్ తెలిపింది. వీటి వినియోగం పెరుగుతుండటంతో ఖర్చులు కూడా విపరీతంగా ఉంటున్నట్టు పేర్కొంది. ఇండియాలో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రెవెన్యూ 2024 నాటికి 10.1 శాతం పెరిగి రూ.4,05,260 కోట్లకు(55 బిలియన్ డాలర్లకు) చేరుకుంటాయని అంచనా. అయితే 2019తో పోల్చుకుంటే 2020లో గ్లోబల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్(ఎం అండ్ ఈ) రెవెన్యూలు 5.6 శాతం తగ్గాయి. ‘కరోనా మహమ్మారి ఎం అండ్ ఈ ఇండస్ట్రీ గ్రోత్పై దెబ్బకొట్టింది. అయితే అన్ని సెగ్మెంట్లలో ఈ ప్రభావం ఒకేలా లేదు. మూవీ థియేటర్లు, లైవ్ ఈవెంట్లు కరోనా దెబ్బకు మూతపడితే.. ఓటీటీ మార్కెట్ పుంజుకుంది’ అని పీడబ్ల్యూసీ ఇండియా ఎగ్జిక్యూటివ్ రాజీవ్ బసు అన్నారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ వంటి కంపెనీలు ఒరిజినల్స్ను, కంటెంట్ను కొనేందుకు భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. ఈ ఖర్చులు సబ్స్క్రిప్షన్ వీడియో–ఆన్–డిమాండ్ పెరిగేందుకు సాయపడుతున్నాయి. మొత్తం ఓటీటీ రెవెన్యూల్లో సబ్స్క్రిప్షన్ వీడియో–ఆన్–డిమాండ్(ఎస్వీఓడీ) 93 శాతంగా ఉంటోంది. వార్షికంగా ఇది 2019–2024 మధ్య 30.7 శాతం వృద్ధి సాధించనుందని తాజా రిపోర్ట్ అంచనావేస్తోంది. 2019లో 708 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎస్వీఓడీ 2024 నాటికి రూ.19,895 కోట్లకు(2.7 బిలియన్ డాలర్లకు) పెరగనుందని పేర్కొంది.
2020 టర్నింగ్ పాయింట్..
కరోనా వైరస్ వల్ల థియేటర్లు ఏడు నెలలు మూతపడ్డాయి. దీంతో చాలా మంది తమ సినిమాలను ఓటీటీ ప్లాట్ఫామ్లపైనే విడుదల చేశారు. ఈ కారణంగా ఓటీటీ మార్కెట్ లాభపడింది. 2018లో ఎస్వీఓడీ రెవెన్యూలు బాక్స్ ఆఫీసు రెవెన్యూల్లో మూడోవంతు ఉండేవి. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్పైకి యూజర్లు మరలడంతో వచ్చే నాలుగేళ్లలో మూవీ బాక్స్ ఆఫీసు రెవెన్యూలు 2.6 శాతం పడిపోనున్నాయని, ఎస్వీఓడీ 30.7 శాతం పెరగనుందని రిపోర్ట్ పేర్కొంది.
వీకెండ్లో నెట్ఫ్లిక్స్ ఫ్రీ…
నెట్ఫ్లిక్స్ తన యూజర్లను పెంచుకునేందుకు వీకెండ్లో ఇండియాలో ఫ్రీ యాక్సస్ కల్పించాలని చూస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరికీ వీకెండ్లో ఈ ఫ్రీ ట్రయల్ యాక్సస్ ఉంటుంది. ఈ ఆఫర్తో ఓటీటీ మార్కెట్లో తన ఉనికిని మరింత పెంచుకోవాలని చూస్తున్నట్టు టాప్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. నెట్ఫ్లిక్స్ ఇటీవలే వన్ మంత్ ఫ్రీ ట్రయల్ను ఆఫర్ చేయడం ఆపివేసింది. ఇండియాలో తాజా ఆఫర్ను అందించిన తర్వాత.. గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశపెట్టనుంది.కరోనా వైరస్ వల్ల మా సబ్స్క్రిప్షన్లు పెరిగాయి. తాజా కంటెంట్ అందించే అవసరం ఇప్పుడు ఎంతో ఉంది. ప్రజలు కంఫర్ట్గా ఇంట్లోనే ఉండి సినిమాలు చూసేలా మేము కంటెంట్ను అందిస్తున్నాం. కొత్త కంటెంట్తో పాటు క్వాలిటీ కూడా అత్యంత ముఖ్యమైనది. థియేటర్లు తిరిగి ప్రారంభమైనా కూడా ప్రజలు మూవీలకు వెళ్లేందుకు టైమ్ పడుతుంది.
గౌరవ్ గాంధీ , డైరెక్టర్, కంట్రీ మేనేజర్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా