
సమాజంలో మంచి, చెడు రెండూ ఉన్నాయి. న్యాయం, అన్యాయం రెండూ జరుగుతున్నాయి. ప్రశంసించడం ఉంది. ప్రశ్నించడమూ ఉంది. అయితే సంఘంలో చోటు చేసుకునే కొన్ని పర్యవసానాలకు తిరిగి మనం ఎలా బదులిస్తున్నాం? ఎలా బతుకులను వెళ్లదీస్తున్నాం..? ఇలాంటి సామాజిక అంశాలను స్పృశిస్తూ.. రచనల్లో సామాజిక స్పృహను ప్రతిబింబించేలా చేసిన ఈ కథలు సాగిన తీరు ఆద్యంతం ఆలోచింపజేస్తుంది. జీవితంలో ఒక పెద్ద కష్టం పరిస్థితుల్ని తలకిందులు చేసి వెళ్లిపోతుంది. అదే విధంగా ఈ సంపుటిలోని తొలి కథలో.. భర్త క్షేమం కోరే భార్య నూకాలు పూజారి చెప్పిన జోస్యం ప్రకారం తన భర్తకు ఏం కాకూడదని వ్రతం చేస్తుంది.
భార్య మూఢ విశ్వాసాలను నమ్మని భర్త గంగరాజు.. చావు అంచుల వరకూ వెళ్లి బతకడమే ‘జీవిత పోరాటం’. మరో కథలో ఆలయ భూములకు వచ్చే ఆదాయాన్ని మధ్యలో గుడి పెద్దలు అన్యాయంగా తింటూ పోతే ఇక ప్రజలకెవరు దిక్కవుతారు. ఏటా గుళ్లో ఉత్సవాలు, పండుగలు జరిపిస్తేనే అక్కడ నాలుగు వృత్తులవారు వలస పోకుండా జీవనం సాగిస్తారని తెలియజెప్పిన ‘శ్రమైక జీవనం’. ఇంకో కథలో.. జశ్వంత్, ఒక అవినీతి నిరోధక శాఖలో ఉద్యోగి. అవినీతి తిమింగలాన్ని పట్టుకొని మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాడు.
బాలకృష్ణ అనే మరో ప్రభుత్వ ఉద్యోగి.. మంచి మనసుతో అవసరాల్లో ఉన్నవారిని ఆదుకుంటాడు. అసలు నేరస్తులు దొరకనప్పుడు ఎవరినో నేరస్తులుగా చిత్రీకరించినట్లుగా.. అక్రమ వ్యాపారాలు, అవినీతి కుంభకోణాలు చేసేవారిని పట్టుకోలేక ఇలా మంచి పనులు చేసేవారిని అరెస్టు చేసి అవమానించడమే నేటి కలిధర్మంగా ఈ కథలో కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాడు రచయిత. వీటితో పాటు ఆపరేషన్ బి, సమన్యాయం, మోదుగపువ్వు వంటి మరెన్నో కథలున్నాయి.
ప్రజలందరూ సమానంగా ఉండాలని, ఎవరికీ మరొకరి పట్ల ఎలాంటి వివక్ష ఉండకూడదని, ప్రతి ఒక్కరూ తోటివారిని గౌరవించుకోవాలని, ఒక మంచి సమాజం నిర్మించుకోవాలనే ఉద్దేశం ఈ కథల్లో తార్కాణంగా నిలుస్తుంది. భవిష్యత్తులో సమాజం ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో అంటూ రెండు భిన్న పార్శ్వాలను అంశంగా ఎంచుకొని కథలు రాశారు. ప్రస్తుత సమాజంలోని లోపాలను, అవకతవకలను విమర్శిస్తూనే.. చక్కని సందేశాన్నిచ్చారు రచయిత.
పి. రాజ్యలక్షి