- నిల్వ, హమాలీ, రవాణాపై ఫోకస్
- గోదాములతో పాటు రైస్ మిల్లులు, షెడ్లు, మార్కెట్ యార్డులు, ఫంక్షన్ హాళ్లు వినియోగించేలా ప్లాన్
- జిల్లాల వారీగా ఉన్నతాధికారులతో కమిషనర్ సమీక్ష
హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్కు సంబంధించిన వడ్ల కొనుగోళ్లను అక్టోబర్ మొదటి వారం నుంచే ప్రారంభించేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఈ సీజన్ లో 65 లక్షల టన్నుల వడ్లు కొనాలని నిర్ణయించిన నేపథ్యంలో సివిల్ సప్లై శాఖ పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. కొనుగోళ్లను సజావుగా ప్రారంభించేలా ఎస్హెచ్టీ వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ధాన్యం నిల్వ, హమాలీల లభ్యత, రవాణా ఏర్పాట్లపై ముందస్తు చర్యలు చేపట్టింది. శనివారం సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కొర్ర లక్ష్మితో పాటు జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్లు, జిల్లా మేనేజర్లు పాల్గొన్నారు.
ధాన్యం నిల్వ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
65 లక్షల టన్నుల వడ్లను నిల్వ చేసేందుకు సాధారణ గోదాములతో పాటు మూసి వేసిన రైస్ మిల్లులు, ఇండస్ట్రియల్ షెడ్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణాలు, ఫంక్షన్ హాళ్లను వినియోగించేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. గుర్తించిన నిల్వ కేంద్రాల్లో అవసరమైన మరమ్మతులను టీజీఎస్ డబ్ల్యూసీ చేపడుతోంది. క్యాప్ విధానంలో ధాన్యాన్ని భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం దిగుమతి, లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియలో హమాలీల కొరత రాకుండా ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. భారీగా ధాన్యం వచ్చే సమయంలో కొనుగోళ్ల ప్రక్రియకు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించారు.
వర్షాల నుంచి వడ్లకు రక్షణ
అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల్లో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యే నాటికి అన్ని కేంద్రాలను అవసరమైన మౌలిక వసతులతో సిద్ధం చేయాలని నిర్ణయించారు. మాయిశ్చర్ మీటర్లు, క్లీనర్లు, డ్రయ్యర్లు అందుబాటులో ఉంచి ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నారు.
అదే విధంగా ధాన్యం రవాణాలో అక్రమాలకు తావులేకుండా ప్రతి వాహనానికి తప్పనిసరిగా జీపీఎస్ ఆధారిత వీఎల్టీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు కొత్తగా ఫిజికల్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కొనుగోలు కేంద్రాల ఇన్చార్జులు నకిలీ రశీదులు, ఫేక్ షీట్లు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు.
