వరికి మద్దతు ధర పెంపు .. క్వింటాల్​కు రూ.69 పెంచిన కేంద్ర సర్కారు

వరికి మద్దతు ధర పెంపు .. క్వింటాల్​కు రూ.69 పెంచిన కేంద్ర సర్కారు
  • ఇక ఎంఎస్​పీ రూ. 2,369..మరో 13 ఖరీఫ్​ పంటల మద్దతు ధర  హైక్​​
  • కేంద్ర కేబినెట్​ కీలక నిర్ణయాలు
  • రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లు  
  • ఏపీలోని బద్వేల్‌‌–- నెల్లూరు 4 లేన్  రోడ్డు అభివృద్ధికి 
  • ఆమోదం.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​లో 2 రైల్వే లైన్ల విస్తరణకు గ్రీన్​ సిగ్నల్​

న్యూఢిల్లీ: ఖరీఫ్‌‌‌‌‌‌‌‌ సీజన్‌‌‌‌‌‌‌‌లో వరి సహా 14 పంటలకు కేంద్ర సర్కారు మద్దతు ధర పెంచింది. వరికి 3 శాతం, పప్పు ధాన్యాలకు 5.96 శాతం, ఆయిల్​ సీడ్స్ ఎంఎస్​పీ 9 శాతం హైక్​ చేసింది. వరికి మద్దతు ధర రూ. 69 పెంచగా.. క్వింటాల్​ ధాన్యం ధర రూ. 2,369కు చేరుకున్నది. బుధవారం  ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నది. 2025–-26 మార్కెటింగ్ సీజన్‌‌‌‌‌‌‌‌కు ఖరీఫ్ పంటలకు కనీస మద్ధతు ధరలను పెంచాలని అగ్రికల్చర్​ మినిస్ట్రీ చేసిన ప్రతిపాదనలను ఆమోదించింది. కేంద్ర కేబినెట్​ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌‌‌‌‌‌‌ మీడియాకు వెల్లడించారు. 

రైతుల సంక్షేమం కోసం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. ఎంఎస్​పీ పెంపుతోపాటు వడ్డీ రాయితీ పథకాన్ని ప్రకటించినట్టు తెలిపారు.  గత 10–-11 ఏండ్లలో ఖరీఫ్ పంటలకు ఎంఎస్‌‌‌‌‌‌‌‌పీ భారీగా పెంచినట్లు తెలిపారు.  ఆయా పంటలకు ఎంఎస్‌‌‌‌‌‌‌‌పీ కోసం రూ.2.7లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లు కేటాయించగా.. అన్నదాతలకు పెట్టుబడిపై 50 శాతం మార్జిన్‌‌‌‌‌‌‌‌ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

 వడ్డీ రాయితీ పథకం కొనసాగింపు..

కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) ద్వారా రైతులకు అందించే వడ్డీ రాయితీ పథకం కొనసాగింపునకు కేంద్ర కేబినెట్​ఆమోదం తెలిపింది.  2025-–26 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత 1.5 శాతం వడ్డీ రాయితీతో కొనసాగించనున్నది. ఇందుకోసం  రూ. 15,642 కోట్లను కేటాయించింది. అలాగే, ఏపీలోని బద్వేల్‌‌‌‌‌‌‌‌-– నెల్లూరు 4 లేన్​ రహదారి అభివృద్ధికి  ఆమోదం తెలిపింది. రూ.3,653 కోట్లతో 108.134 కిలోమీటర్ల పొడవున ఈ రహదారిని అభివృద్ధి చేయనున్నది. బద్వేల్‌‌‌‌‌‌‌‌లోని గోపవరం నుంచి నెల్లూరు జిల్లాలోని గురివిందపూడి వరకు నిర్మాణం చేపట్టనున్నది. ఈ కారిడార్‌‌‌‌‌‌‌‌తో కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం దాదాపు 33.9 కిలోమీటర్లు తగ్గనున్నది.  

వీటితోపాటు వార్దా-–బల్లార్షా 4 లేన్​, రత్లాం-–నగ్దా మధ్య రైల్వే లైన్‌‌‌‌‌‌‌‌కు కేంద్ర కేబినెట్​ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. రూ. 3,339 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులు 2029–30 వరకు పూర్తవుతాయని పేర్కొన్నది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాలను కవర్ చేసే ఈ రెండు ప్రాజెక్టులు ఇండియన్​ రైల్వే నెట్​వర్క్​ను దాదాపు 176 కిలోమీటర్లు 
పెంచుతాయని అశ్వినీ వైష్ణవ్​ తెలిపారు.

ఏ పంటకు ఎంత ఎంఎస్​పీ పెంచారంటే?

మొత్తం 14 ఖరీఫ్‌‌‌‌‌‌‌‌ పంటలకు క్వింటాల్‌‌‌‌‌‌‌‌పై ఎంఎస్​పీ పెరిగింది. వరి సాధారణ, గ్రేడ్- ఏకు  రూ.69 పెంచగా.. జొన్నలు రూ.328,  సజ్జలు రూ.150,  రాగులు రూ.596,  మొక్కజొన్న రూ.175,  కందులు రూ.450, పెసర రూ.86,  మినుములు రూ.400, వేరుశెనగ రూ.480, పొద్దుతిరుగుడు రూ.441, సోయాబీన్ రూ.436, నువ్వులు రూ.579, నైజర్​సీడ్​ రూ.820; పత్తి రూ.589 చొప్పున మద్దతు ధరను పెంచారు.