
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సీజన్ నిరవధికంగా వాయిదా పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, దీనిపై దేశ ఫుట్బాల్ సమాజం మొత్తం ఎంతో బాధగా, భయంగా ఉందని ఇండియా మాజీ కెప్టెన్, సునీల్ ఛెత్రి అన్నాడు. ఐఎస్ఎల్ వాయిదా ప్రకటన తర్వాత దేశంలో ఫుట్బాల్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు ఎన్నో ఫోన్ కాల్స్, మెసేజ్లు వస్తున్నాయని మెగా లీగ్లో బెంగళూరు ఎఫ్సీ తరపున ఆడే 40 ఏండ్ల ఛెత్రి చెప్పాడు.
లీగ్ ఆర్గనైజర్స్ ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఎఫ్ఎస్డీఎల్), ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) మధ్య ఉన్న మాస్టర్ రైట్స్ అగ్రిమెంట్ (ఎంఆర్ఏ) రెన్యువల్ గురించి స్పష్టత లేకపోవడం ఐఎస్ఎల్ వాయిదాకు కారణమైనంది. ఈ ఒప్పందం డిసెంబర్ 8న ముగుస్తుంది. అయితే, ఏఐఎఫ్ఎఫ్ ముసాయిదా రాజ్యాంగం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఎఫ్ఎస్డీఎల్తో కొత్త ఎంఆర్ఏ నిబంధనలను చర్చించవద్దని సుప్రీంకోర్టు ఏఐఎఫ్ఎఫ్ని ఆదేశించింది.
లీగ్ వాయిదా పడిన విషయం మొదట తెలిసినప్పుడు తనకు నవ్వొచ్చిందని, ఫిట్నెస్ కోసం తనకు మరింత సమయం దొరికిందని భావించానని ఛెత్రి చెప్పాడు. ‘కానీ, ఆ రెండు వారాలు ఇప్పుడు నిరవధిక వాయిదాగా మారడడంతో నా నవ్వు చెరిగిపోయింది. దేశంలో ఫుట్బాల్ను నడిపించేవారు, అందులో పాలుపంచుకున్న వారందరూ సీజన్ను తిరిగి ప్రారంభించడానికి కృషి చేస్తున్నారని నాకు తెలుసు. త్వరలోనే ఒక పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నాడు. ఈ సంక్షోభ సమయంలో ఇండియన్ ఫుట్బాల్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ సహనంతో ఉండాలని ఛెత్రి సూచించాడు.