ODI World Cup 2023: భారతీయులను క్షమాపణ కోరిన పాక్ క్రీడా జర్నలిస్ట్

ODI World Cup 2023: భారతీయులను క్షమాపణ కోరిన పాక్ క్రీడా జర్నలిస్ట్

ఒక్క ఓటమి.. పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో, ఆ దేశ జర్నలిస్టుల్లో ఎంతో మార్పు తెచ్చింది. నిన్నటిదాకా భారత్ అంటే విషం కక్కే ఆ దేశ మీడియా, అక్కడి జర్నలిస్టులు ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు. పాకిస్తాన్ పై ఆప్ఘనిస్తాన్ విజయం సాధించిన నిమిషాల వ్యవధిలోనే.. వారు భారత్‌కు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇదిలావుంటే, ఎల్లప్పుడూ భారత క్రికెట్ జట్టుపై విషపు వార్తలు రాసే.. ఓ క్రీడా జర్నలిస్ట్ భారతీయులను క్షమాపణ కోరాడు. 

క్రిక్ డెన్ ఫౌండర్, పాకిస్తాన్ క్రీడా జర్నలిస్ట్ ఫరీద్ ఖాన్ భారతీయులను క్షమాపణ కోరాడు. ఇప్పటివరకూ తాను పెట్టిన పోస్టుల వల్ల ఎవరి మనసైనా నొప్పించి ఉంటే క్షమించాలని ప్రాధేయపడ్డాడు. "నన్ను క్షమించండి, భారతీయ అభిమానులారా! మేము ఓడిపోయాము.." అని ఫరీద్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌పై నెటిజన్స్ భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. అతన్ని మన్నిస్తున్నవారు కొందరైతే, గతంలో అతడు పెట్టిన పోస్టులు వెలికితీస్తున్న వారు మరికొందరు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. చెన్నై స్లో పిచ్‌పై ఇది మంచి స్కోరే అయినప్పటికి.. ఆఫ్ఘన్ బ్యాటర్ల పోరాటం ముందు అది చిన్నబోయింది. ఆ జట్టు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్ (65), ఇబ్రహీం జాద్రాన్ (87) హాఫ్ సెంచరీలతో విజయానికి మంచి పునాది వేశారు. ఆ తరువాత వీరిద్దరూ ఔటైనా రహ్మత్ షా (77 నాటౌట్), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (48 నాటౌట్) జట్టును విజయ తీరాలకు చేర్చారు. అంతకుముందు ఆఫ్ఘన్ బౌలర్లు కూడా రాణించారు.