T20 World Cup: రాణించిన ఫర్హాన్‌, బాబర్‌: అమెరికాపై పాక్ విజయం

T20 World Cup: రాణించిన ఫర్హాన్‌, బాబర్‌: అమెరికాపై పాక్ విజయం

కొలంబో: బ్యాటింగ్‌లో సాహిబ్జాదా ఫర్హాన్ (73), బాబర్‌ ఆజమ్‌ (46), షాదాబ్‌ ఖాన్‌ (30) రాణించడంతో.. టీ20 వరల్డ్‌ కప్‌లో పాకిస్తాన్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన గ్రూప్‌–ఎ మ్యాచ్‌లో 32 రన్స్‌ తేడాతో అమెరికాను ఓడించింది. టాస్‌ ఓడిన పాక్‌ 20 ఓవర్లలో 190/9 స్కోరు చేసింది. స్టార్టింగ్‌ నుంచే దూకుడుగా ఆడిన ఓపెనర్లు సైమ్‌ అయూబ్‌ (19), ఫర్హాన్‌ తొలి వికెట్‌కు 54 రన్స్‌ జోడించారు. 

సల్మాన్‌ ఆగా (1) నిరాశపర్చినా.. బాబర్‌ ఆజమ్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫర్హాన్‌తో మూడో వికెట్‌కు 81 రన్స్‌ జోడించాడు. 6 రన్స్‌ తేడాతో ఈ ఇద్దరూ వెనుదిరిగినా.. షాదాబ్‌ ఖాన్‌ మెరుగ్గా ఆడాడు. చివర్లో మహ్మద్‌ నవాజ్‌ (5), ఫహీమ్‌ అష్రాఫ్‌ (1), ఉస్మాన్‌ ఖాన్‌ (0), అబ్రార్‌ అహ్మద్‌ (0) నిరాశపర్చారు. షాడ్లీ వాన్ 4 వికెట్లు తీశాడు. తర్వాత అమెరికా 20 ఓవర్లలో 158/8 స్కోరుకే పరిమితమైంది. 

శుభమ్‌ రంజన్‌ 51) టాప్‌ స్కోరర్‌. షాయన్ జహంగీర్ (49), మిలింద్‌ కుమార్‌ (29), ఆండ్రియస్‌ గౌస్‌ (13) పోరాడారు. పాక్​ బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టమైన బౌలింగ్​తో యూఎస్​ టాప్​ ఆర్డర్​ను అడ్డుకున్నారు. ఉస్మాన్‌ తారిక్‌ (3/27), షాదాబ్‌ ఖాన్‌ (2/26) దెబ్బకు ఆరుగురు సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితం కావడం అమెరికాను దెబ్బతీసింది. ఫర్హాన్​కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.