బషీర్బాగ్, వెలుగు: గత మూడు నెలల నుంచి పనులు చేయించుకుంటూ డబ్బులు అడిగితే చంపేస్తామని ఓ బిల్డర్ బెదిరిస్తున్నారని నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం లక్షారం గ్రామానికి చెందిన వలస కూలీలు వాపోయారు. సోమవారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్ లో పౌర హక్కుల ప్రజా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవింధ్యాలతో కలిసి బాధితులు రామస్వామి, అనూష, మాషయ్య మాట్లాడారు.
గత మూడు నెలలు కింద మెహిదీపట్నంలోని విజయనగర్ కాలనీలో మహ్మద్ ఫారుఖ్ అనే బిల్డర్ వద్ద కూలీ పనులు చేశామని, మొత్తం 26 మంది కూలీలకు రూ.లక్ష అడ్వాన్స్గా ఇచ్చారన్నారు. పనులు పూర్తయిన తర్వాత రూ.30 లక్షలు ఇస్తామని బిల్డర్ హామీ ఇచ్చారని, పనులు పూర్తయి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ సంబంధిత బిల్డర్ డబ్బులు అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఆయనపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
