
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని శిల్పారామం ఆవరణలో శుక్రవారం వేస్ట్ మేనేజ్మెంట్ పై మొదటి స్టార్టప్ సమ్మిట్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లో నిష్ణాతులైన వారు సెమినార్ లో పాల్గొన్నట్లు తెలిపారు.
40 స్టార్టప్స్ వచ్చాయని, వారి ఆవిష్కరణలు ప్రదర్శిస్తున్నారని చెప్పారు. పట్టణీకరణ అభివృద్ధి చెందడంతో పాటు వేస్టేజ్ కూడా పెరుగుతుందని తెలిపారు. అర్బన్ వేస్టేజీతో వాతావరణ, నీటి, వాయు కాలుష్య పెరుగుతోందని చెప్పారు. ఆరోగ్యానికి హాని చేస్తున్న కాలుష్యాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పురపాలక, పట్టణాభివృద్ది శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి, కలెక్టర్ విజయేందిర బోయి, అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థుల్లో క్రీడా స్పూర్తిని నింపాలి
పాలమూరు: విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ఒలంపిక్ రన్ నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నగరంలో 39వ ఒలంపిక్ డే రన్ ను నిర్వహించారు. జిల్లాలోని క్రీడాభిమానులు క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం థాయిలాండ్ లో జరిగిన సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొన్న జిల్లా క్రీడాకారుడు కిరణ్ కుమార్ ను ఎమ్మెల్యే సన్మానించారు.
బీసీ, ఎస్సీ హాస్టళ్లను ఎమ్మెల్యే తనిఖీ చేసి విద్యార్థులకు అన్ని సౌలతులు కల్పించాలని ఆదేశించారు. ఒలంపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, ఒలంపిక్ సంఘం కార్యదర్శి కురుమూర్తి, డీవైఎస్ వో శ్రీనివాస్, రాములు యాదవ్, ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదాబాయి పాల్గొన్నారు.