- బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలి
- యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి
- దివ్యాంగులకు స్కూటీల పంపిణీ
.యాదాద్రి, వెలుగు : వృద్ధులను నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. వారి హక్కులకు భంగం కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన వయోవృద్ధుల సంక్షేమ కమిటీ మీటింగ్లో ఆమె మాట్లాడారు. వారి ఆస్తులు, కోర్టు తీర్పుల అమలుపై శ్రద్ధ చూపాలని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు కచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వృద్ధులకు ఏదైనా సమస్య వస్తే 14567 నంబర్కు ఫోన్ చేయాలని, గంటలోపే వారిని ఆదుకుంటామన్నారు.
దివ్యాంగులకు స్కూటీల పంపిణీ
నడవలేని స్థితిలో ఉన్న వారికి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసిన వీల్ చైర్లు, స్కూటీలు ఉపయోగకరంగా ఉంటాయని కలెక్టర్ పమేలా సత్పతి చెప్పారు. వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా దివ్యాంగులకు ఎలక్ట్రిక్ పరికరాలను శుక్రవారం పట్టణంలోని కృషి ఐటీఐ కాలేజీలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, డీఆర్వో శ్రీనివాసరెడ్డి, ఏసీపీ ఉదయ్రెడ్డి, ఆర్డీవోలు భూపాల్రెడ్డి, సూరజ్కుమార్, డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, డీఎంహెచ్వో సాంబశివరావు, వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణవేణి పాల్గొన్నారు.
బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలి
తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా బతుకమ్మ పండుగను నిర్వహించాలని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. చెరువులు, కుంటలను క్లీన్గా ఉంచాలని, అవసరమైన చోట రిపేర్లు చేయించాలని చెప్పారు. బతుకమ్మ పండుగపై పోటీలు నిర్వహించి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రైజ్లు అందజేయాలని సూచించారు.
ఆర్అండ్ఆర్ ఇప్పించండి
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ తమకు కూడా వర్తించేలా చూడాలని బస్వాపురం రిజర్వాయర్ నిర్వాసితులైన బీఎన్.తిమ్మాపురం గ్రామస్తులు కోరారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీ స్టేట్ లీడర్ గూడూరు నారాయణరెడ్డితో కలిసి యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో తిమ్మపూర్లో ఆధార్ కార్డు, ఓటు హక్కు లేకుండా పోయిందన్నారు. దీంతో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వబోమని ఆఫీసర్లు చెబుతుండడంతో 280 ఫ్యామిలీలు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు గూడూరు నారాయణరెడ్డి చెప్పారు.