పరిషత్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ నేడే

పరిషత్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ నేడే
  •    195 జడ్పీటీసీలు, 2,097 ఎంపీటీసీలకు ఎన్నికలు
  •     ఎంపీటీసీలకు 7,072 మంది, జడ్పీలకు 882 మంది పోటీ
  •     మొదటి దశలో 2 జడ్పీటీసీలు,
  •     69 ఎంపీటీసీలు ఏకగ్రీవం
  •     పార్టీ గుర్తులతోనే ఎన్నికలు
  •     గట్టి బందోబస్తు.. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్
  •     నక్సల్ ప్రభావిత జిల్లాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్
  •     మిగతా చోట్ల 5 గంటల వరకే

రాష్ట్రంలో తొలి దశ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 7 గంటలకు 195 జడ్పీటీసీలు, 2,097 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ మొదలుకానుంది. సగటున ఒక్కో జడ్పీటీసీ సీటుకు నలుగురు, ఒక్కో ఎంపీటీసీ సీటుకు ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో సాయంత్రం సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్  జరగనుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ, అధికారులు పరిశీలన పూర్తయ్యాయి. మండల కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు ప్రచార సామాగ్రిని తరలించారు. పోలింగ్ కు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తయింది.

పార్టీ గుర్తులతో..

జనవరిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరగగా.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనున్నాయి. ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులకు 90 గుర్తులను అందుబాటులో ఉంచింది. స్థానికేతరులు మండల కేంద్రాల్లో ఉండరాదని పోలీసులు, ఈసీ అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, జరిమానా, జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పలు సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.