బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసేందుకు, మొబైల్ కనెక్షన్లకు, కేవైసీ అథెంటికేషన్కు ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్గా ఉపయోగించేందుకు సంబంధించిన ఆధార్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం ఈ మేరకు రాజ్యసభలో వాయిస్ ఓటు ద్వారా బిల్లు పాస్ అయింది. డేటా చోరీ జరిగే అవకాశం ఉందన్న కారణంతో తృణముల్ కాంగ్రెస్, డీఎంకే సహా పలు పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఆధార్ డేటా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రైవేటు సంస్థలకు రూ.కోటి వరకు పెనాల్టీ, జైలు శిక్షలు విధించేలా కొత్త చట్టంలో రూల్స్ పొందుపరిచారు.
ఏపీలో రెండు వర్సిటీలకు లోక్సభలో బిల్లు
ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సంబంధించి సోమవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టారు. విభజన చట్టంప్రకారం ఏపీలో సెంట్రల్, గిరిజన వర్సిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది.
‘జలియన్ వాలా బాగ్’ బిల్లు కూడా..
జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్టులో పర్మినెంట్ మెంబర్గా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండాలన్న నిబంధనను తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ మేరకు జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ సవరణ బిల్ను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి.. సభలో పెట్టారు. అయితే దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది.
