చర్లపల్లి జైలులో కేసీఆర్ కు డబుల్ బెడ్రూం కట్టిస్తాం : రేవంత్ రెడ్డి

చర్లపల్లి జైలులో కేసీఆర్ కు డబుల్ బెడ్రూం కట్టిస్తాం : రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాగానే.. కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల బెడ్రూం ఇల్లు కట్టిస్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుల పేరుతో  లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నాడని.. హైదరాబాద్ చుట్టుపక్కల 10 వేల ఎకరాల  భూములు కబ్జా చేశాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. తెలంగాణ సొమ్మును దోచుకుని తిన్న కేసీఆర్, అతని కుటుంబం చర్లపల్లికి వెళుతుందని.. ఆ జైలులోనే డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి ఇస్తామంటూ హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి.

రైతు బంధు ఆగటానికి హరీశ్ రావు కారణం అని.. ఎలక్షన్ కమిషన్ అదే చెప్పిందన్నారు రేవంత్ రెడ్డి. రైతుబంధుపై బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా రైతులను మోసం చేసిందని.. రైతుబంధుపై మాట్లాడొద్దన్న ఈసీ ఆదేశాలు, నిబంధనలు మంత్రి హరీశ్ రావుకు తెలియదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. 

ఈనెల కేసీఆర్ ఉంటే రైతు బంధు 5 వేల రూపాయలు మాత్రమే అని.. కేసీఆర్ ఓడిపోతే రైతు భరోసా కింద ఎకరాకు 15 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను బొంద పెడితే.. 4 వేల రూపాయల పెన్షన్ ఇచ్చే బాధ్యత మాది అంటూ భరోసా ఇచ్చారాయన. పెళ్లి చేసుకునే ఆడ బిడ్డకు లక్ష రూపాయల డబ్బుతోపాటు.. తులం బంగారం ఇస్తూ.. బంగారు తెలంగాణ చేస్తామని హామీ ఇచ్చారాయన. ఉచిత ఇంటి స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని.. ఇళ్లు లేని పేదలందరికీ ఇస్తామన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని.. డోర్నకల్ లో పార్టీ ప్రచార సభలో ఈ హామీలు, భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్రంలోని రెండు కోట్ల మంది మహిళలు అందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని.. టికెట్ లేకుండా రాష్ట్రం మొత్తం ఎక్కడైనా తిరగొచ్చన్నారు రేవంత్ రెడ్డి. ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని.. కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.