జవహర్నగర్, వెలుగు: ‘జవహర్నగర్ నా గుండెకాయ’ అని చెప్పుకునే మంత్రి మల్లారెడ్డి ఒక్కసారి అక్కడి కార్మికనగర్ ఎలా ఉందో వచ్చి చూడాలని పీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. కొద్దిరోజులుగా పడుతున్న వానలకు జవహర్నగర్ డంపింగ్యార్డులో నీరు నిలువగా, ఈ నీటిని బయటకు వదిలేందుకు కార్మికనగర్కు ఆనుకొని ఉన్న గోడను కూల్చేశారు. దీంతో డంపింగ్ యార్డ్ నుంచి మురుగు నీరు మొత్తం కార్మికనగర్లోని ఇండ్లలోకి చేరింది. దీంతో దుర్వాసనతో ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విషయం తెలుసుకున్న హరివర్ధన్ రెడ్డి మంగళవారం కార్మికనగర్ను సందర్శించారు. గోడ కూల్చిన రాంకీ మేనేజ్మెంట్కు కాల్ చేసి వారం రోజుల్లో ఆ గోడను తిరిగి నిర్మించాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జవహర్ నగర్.. నా గుండెకాయ’ అని చెప్పుకునే మంత్రి మల్లారెడ్డి ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి వచ్చి చూడాలన్నారు. వారం రోజుల్లో సమస్యలను పరిష్కరించకపోతే ఆయన ఇంటిని, కార్పొరేషన్ ఆఫీస్ను ముట్టిస్తామని హెచ్చరిం చారు. ఈ ప్రాంతంలో నిరుపేదలు ఉండటంతోనే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు ఉన్నారు.