
- కవిత ఎపిసోడ్ బీజేపీకి బలం
హైదరాబాద్, వెలుగు: కవిత ఏ చెట్టు నీడలో బతుకుతున్నారో.. ఆ చెట్టునే నరికేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆమె స్వతహాగా లీడర్ కాదని, కేసీఆర్ను దేవుడు అంటూనే.. ఆయన రాజకీయ జీవితాన్ని సమాధి చేస్తున్నారని చెప్పారు. ఆదివారం మీడియాతో జగ్గారెడ్డి చిట్చాట్ చేశారు. ‘కవిత ఎపిసోడ్.. బీజేపీకి బలం పెంచేలా ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ అప్రమత్తం కావాలి. బీఆర్ఎస్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకుని.. బీజేపీని పెంచే పనిలో ఉంది. రాష్ట్రంలో ఉనికి లేని బీజేపీని.. ఇంట్లో పంచాయితీతో ఆ పార్టీకి బలం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ పిల్లలు దారి తప్పినట్లే భావించాలి”అని జగ్గారెడ్డి అన్నారు. కొడుకే రాజకీయ వారసుడని, బిడ్డ వారసురాలు కాలేదని అన్నారు.
కొడుకు లేకపోతే.. బిడ్డకు అవకాశం ఉంటుందని, కొడుకు ఉండగా.. బిడ్డకు వారసత్వం రాదని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో రెండో స్థానం బీఆర్ఎస్, మూడో స్థానం బీజేపీదని జోష్యం చెప్పారు. కుటుంబ తగాదాలతో గులాబీ క్యాడర్లో నిరుత్సాహం ఏర్పడుతుందని, దీంతో వారు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉంటుందని, ఈ సమయంలో కాంగ్రెస్ నాయకత్వం బీఆర్ఎస్ క్యాడర్ను కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని సూచించారు. సమయం వచ్చినప్పుడు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్కు చెప్తానని, కొన్ని విషయాలు పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో పంచుకుంటానని తెలిపారు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా కేసీఆర్.. కేసీఆరేనని, ఆయనతోనే ఆ పార్టీకి ఉనికి అని, కేటీఆర్, హరీశ్, కవితతో బీఆర్ ఎస్కు ఒరిగేదేమి లేదన్నారు. కవిత డిప్రెషన్లో లేఖలు విడుదల చేశారని, ఆ లేఖలతో కాంగ్రెస్కు వచ్చిన ఇబ్బందేమీ లేదని పేర్కొన్నారు.