ప్రాణ నష్టం జరగకుండా చూడడమే లక్ష్యంగా అన్ని పురపాలికలు పనిచేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో సోషల్ మీడియా ద్వారా వచ్చే సమస్యలపై వెంటనే పరిష్కార మార్గాలు చూపాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల పరిస్థితుల పైన పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాలపై దృష్టి సారించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు ఇలాగే కొనసాగితే చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యల పైనా ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆర్డర్స్ పాస్ చేశారు.
ఈ వర్షాల వల్ల పురాతన భవనాలు కూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించే చర్యలు కొనసాగించాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలకు సంబంధించిన ప్రాంతాలపైన ప్రధాన దృష్టి సారించి హెచ్చరిక సూచీలను ఏర్పాటు చేయాలన్నారు. స్థానికంగా ఉన్న పోలీస్, సాగునీటి, విద్యుత్ మరియు రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్న కేటీఆర్... వరద నివారణ/తగ్గింపు చర్యలు చేపట్టాలన్నారు. అందుకోసం ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ, జలమండలి కమాండ్ కంట్రోల్ సెంటర్లను విస్తృతంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీడీఎంఏను కేటీఆర్ ఆదేశించారు.
Reviewed the excess rainfall & resultant situation within GHMC & all other Towns in the state with Municipal Administration team through a VC
— KTR (@KTRTRS) July 27, 2022
Have asked Special CS MA&UD @arvindkumar_ias to monitor closely along with @CommissionrGHMC @MDHMWSSB @cdmatelangana pic.twitter.com/KbI0tdbSaS
పట్టణాలకు ఆనుకొని ఉన్న చెరువులు, కుంటలు, ఇతర సాగునీటి వనరులకు సంబంధించిన పర్యవేక్షణను నిరంతరం కొనసాగించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వాటి యొక్క పూర్తిస్థాయి నిలువ సామర్థ్యం, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వంటి వాటిపై సాగునీటి శాఖతో నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే అత్యవసరమైన రోడ్ల మరమ్మతులను వెంటనే ప్రారంభించాలని చెప్పారు. అంతే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా జంట జలాశయాలు, మూసీ నది పరివాహక ప్రాంతంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు.