
వంగూరు, వెలుగు : సర్కార్ బడులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా ఉపాధ్యాయులు, స్కూల్ డెవలప్ మెంట్, అడ్వైజర్ కమిటీలు కృషి చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సూచించారు. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి కావలసిన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్ లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే రోజుల్లో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సర్కార్ బడులను తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో పేరెంట్స్ తమ పిల్లలను చదివిస్తే భవిష్యత్ కు భరోసా ఉంటుందని అవగాహన కల్పించడంలో టీచర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. అనంతరం విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్ అందజేశారు. 30 మందితో స్కూల్ డెవలప్ మెంట్ కమిటీ, 11 మందితో స్కూల్ అడ్వైజర్ కమిటీ, వాటి బాధ్యతలను చైర్మన్ వివరించారు. కార్యక్రమంలో విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్, జోత్స్నశివారెడ్డి, విశ్వేశ్వర్, ఎంపీడీవో బ్రహ్మచారి, ఎంఈఓ, మురళీమోహన్ చారి పాల్గొన్నారు.