సోషల్ మీడియాలో ప్రధాన పార్టీలను తలదన్నేలా ఫాలోయింగ్ సంపాదించుకుని షాకిచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కార్యకలాపాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. అంతేకాదు.. ఫేక్ అడ్వకేట్ల అంశంపై కూడా విచారణ జరిపించాలని పిటిషనర్ సుప్రీం కోర్టును అభ్యర్థించారు.
కోర్టు విచారణలలో వ్యక్తపరిచే మౌఖిక వ్యాఖ్యలను వాణిజ్యపరంగా వాడుకోవడం, ట్రేడ్మార్క్లను దుర్వినియోగం చేయడం, డబ్బు సంపాదించేందుకు వాటిని ప్రచారం చేసే వ్యక్తులపై కూడా విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో ఈ చర్యలకు పాల్పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. రాజా చౌదరి అనే న్యాయవాది సుప్రీం కోర్టులో ఈ ప్రజా హిత వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు.
పెరిగిపోతున్న నిరుద్యోగం.. పెరగని జీతాలు.. పడిపోతున్న రూపాయి.. పైకి ఎగబాకుతున్న ధరలు.. మారని బతుకులు.. మార్చలేనంతగా మారిపోయిన రాజకీయాలు.. ఎటుచూసినా అవినీతి, అక్రమాలు.. ఒక్కటేమిటి? దేశంలోని పరిణామాలను ప్రశ్నిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాల విధానాలు, రాజకీయ నిర్ణయాలను నిలదీస్తున్నది. ఆ పార్టీనే ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’.
►ALSO READ | 15 రోజుల పనికి ‘ఇదిగో నీ కూలీ డబ్బులు’ అని రూ. 200 చేతిలో పెట్టారు.. వీడియో వైరల్ !
మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దీప్కే అనే 30 ఏండ్ల యువకుడి ఆలోచన నుంచి ఈ నెల 16న పుట్టిందీ పార్టీ. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను సీజేపీ దాటేసింది. దేశంలోని పరిస్థితులపై జెన్జీ తీవ్ర అసహనం, అసంతృప్తితో ఉన్నదని ఈ పరిణామం రుజువు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సీజేపీ ఆధారంగా యువత.. ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటోంది. ఇప్పుడది ప్రశ్నించే స్థాయి నుంచి.. ఓ ఆన్లైన్ ఉద్యమం దాకా పెరిగిపోయింది. ఈ పార్టీకి రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు చాలా మంది మద్దతుగా నిలబడ్డారు. ఆ పార్టీని ఫాలో అవుతున్నారు.
