అధికారులు లేరని కుర్చీకి వినతిపత్రం.. హయత్ నగర్ వాటర్ బోర్డు ఆఫీసులో ఘటన

అధికారులు లేరని కుర్చీకి వినతిపత్రం..  హయత్ నగర్  వాటర్ బోర్డు ఆఫీసులో  ఘటన
  • డ్రైనేజీ సమస్య తీర్చాలని కాలనీవాసుల డిమాండ్​

ఎల్బీనగర్, వెలుగు: డ్రైనేజీ  సమస్య చెప్పుకుందామని వెళ్తే వాటర్ బోర్డ్ అధికారులు లేకపోవడంతో కాలనీవాసులు ఖాళీ కుర్చీకి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. సోమవారం హయత్ నగర్ లోని వాటర్​ బోర్డు ఆఫీసులో ఈ ఘటన జరిగింది. కుమ్మరి కుంట చెరువును ఆనుకొని సుమారు 15 కాలనీలు ఉన్నాయి. చెరువుకు డ్రైనేజీని కలపడంతో దుర్వాసన వచ్చి కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

ప్రతీ సోమవారం వాటర్​బోర్డు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తారు. దీంతో తమ సమస్యను చెప్పుకుందామని కాలనీలవాసులు హయత్ నగర్ లోని 11వ డివిజన్ వాటర్ బోర్డ్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఫిర్యాదు చేసేందుకు ఒక్క అధికారి కూడా లేకపోవడంతో వారు ఖాళీగా ఉన్న మేనేజర్ కుర్చీకి వినతిపత్రం అందించి  నిరసన తెలిపారు.