- కొత్త చట్టంతో మారనున్న ఉద్యోగుల శాలరీ, పీఎఫ్, లీవ్స్
- నేటి నుంచి రూల్స్ అమల్లోకి!
బిజినెస్ డెస్క్, వెలుగు: లేబర్ చట్టాల్లోని వేజ్ కోడ్ రూల్స్ నేటి నుంచి అమల్లోకి తేవాలని కేంద్రం చూస్తోంది. ఈ రూల్స్ ప్రకారం, పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెరగనుంది. ఉద్యోగుల నెట్ శాలరీ తగ్గనుంది. అంతేకాకుండా ఉద్యోగుల వర్కింగ్ హవర్స్ పెరగనున్నాయి కూడా. ఇంకా కొన్ని రాష్ట్రాలు లేబర్ చట్టాల కింద రూల్స్ను తయారు చేయలేదు. ఇప్పటి వరకు కేవలం 23 రాష్ట్రాలు, యూటీలు మాత్రమే లేబర్ చట్టం కింద రూల్స్ను తయారు చేశాయని లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.
వారంలో నాలుగు రోజులే పని..
ఈ కొత్త రూల్స్ ప్రకారం, ఎంప్లాయర్స్ (ఉద్యోగం ఇచ్చేవారు) తమ ఉద్యోగులతో రోజుకి 12 గంటల పాటు పనిచేయించుకోవచ్చు. ప్రస్తుతం ఈ టైమ్ గరిష్టంగా 8–9 గంటలు ఉంది. ఒకవేళ ఎంప్లాయర్స్ తమ ఉద్యోగులతో రోజుకి 12 గంటల పాటు పనిచేయించుకుంటే వారానికి మూడు రోజులు వీక్ ఆఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం, ఉద్యోగులతో వారంలో గరిష్టంగా 48 గంటలు మాత్రమే ఎంప్లాయర్స్ పనిచేయించుకోవాలి. అంతేకాకుండా ఓవర్ టైమ్ ఒక క్వార్టర్లో 125 గంటల వరకు పెంచుకోవడానికి ఎంప్లాయర్స్కు వీలుంటుంది. ప్రస్తుతం ఇది 50 గంటలుగా ఉంది. కొత్త రూల్స్ ప్రకారం, ఉద్యోగి గ్రాస్ శాలరీలో సగం బేసిక్ శాలరీగా ఉండాలి. దీంతో ఉద్యోగులు చెల్లించే పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెరుగుతుంది. నెట్ శాలరీ తగ్గుతుంది. ఉద్యోగులకు అందే రిటైర్మెంట్ ఫండ్, గ్రాట్యుటి పెరుగుతుంది.