వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు: సెలబ్రిటీలపై చిన్మయి ఫైర్, రజినీ, కమల్‌ని కూడా వదల్లేదు!

వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు: సెలబ్రిటీలపై చిన్మయి ఫైర్, రజినీ, కమల్‌ని కూడా వదల్లేదు!

భారతదేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు (Jnanpith Award) ఈసారి ప్రముఖ తమిళ కవి, గీతరచయిత వైరముత్తుకు (Vairamuthu) ప్రకటించబడింది. ఈ నిర్ణయం సాహిత్య వర్గాల్లో ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం కొత్త వివాదానికి దారితీసింది. ముఖ్యంగా  సింగర్ చిన్మయి (Chinmayi Sripaada) ఈ నిర్ణయంపై తీవ్రంగా స్పందిస్తూ తనదైన శైలిలో ప్రశ్నలు లేవనెత్తింది. 

2018లో జరిగిన మీ టూ ఉద్యమం (MeToo movement) సమయంలో వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం మరోసారి చర్చకు వచ్చింది. ఆ సమయంలో ఆరోపణలు చేసిన మహిళల్లో చిన్మయి కూడా ఒకరు. ఈ విషయం బయటకు చెప్పినందుకు తాను వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని కూడా ఆమె గుర్తుచేసుకుంది.

అయితే, ఇపుడు జ్ఞానపీఠ్ అవార్డు ప్రకటించిన తర్వాత చిన్మయి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఈ నిర్ణయాన్ని ప్రశ్నించింది. అంతేకాకుండా, గతంలో జ్ఞానపీఠ్ అవార్డు స్వీకరించిన ప్రముఖ బెంగాలీ రచయిత్రి ఆశాపూర్ణ దేవి (Ashapoorna Devi) చేసిన మహిళా హక్కులపై వ్యాఖ్యలను కూడా చిన్మయి తన పోస్టుల్లో ప్రస్తావించింది.

వైరముత్తుకు అవార్డు రావడంపై పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు రావడాన్ని పలువురు సినీ ప్రముఖులు అభినందించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth) సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వైరముత్తును తన ప్రియ స్నేహితుడిగా పేర్కొంటూ అభినందనలు తెలిపారు.

రజినీకాంత్ పోస్ట్

వైరముత్తుకు రజినీకాంత్ అభినందనలు తెలుపుతూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. “మా భారత జాతి గొప్ప జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, నా ప్రియమైన స్నేహితుడు, గౌరవనీయులైన కవి వైరముత్తుకు నా హృదయపూర్వక అభినందనలు’’ అని రజినీకాంత్ తెలిపారు.

ఈ ట్వీట్ని చిన్మయి రీషేర్ చేస్తూ.. “అయ్యయ్యో!!! పురియవే పురియాధ (ఏం పజిల్)?!” అని సూపర్ స్టార్ ని ప్రశ్నించింది. మరో స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) కూడా వైరముత్తును అభినందించగా, ప్రభావశీల వ్యక్తులు మహిళల ఆరోపణలను పట్టించుకోకుండా తమ పరిచయస్తులకు మద్దతు ఇస్తారని చిన్మయి విమర్శించింది.
మూడో తమిళ రచయితగా వైరముత్తు

ఈ వివాదాల మధ్య కూడా వైరముత్తు జ్ఞానపీఠ్ అవార్డు అందుకోవడం తమిళ సాహిత్యానికి ఒక ముఖ్య ఘట్టంగా భావిస్తున్నారు. ఈ అవార్డు అందుకున్న మూడో తమిళ రచయితగా వైరముత్తు నిలిచారు. అంతకుముందు నవలా రచయితలు అఖిలన్ (1975) మరియు జవకాంతన్ (2002) ఈ గౌరవాన్ని పొందారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (M.K. Stalin) కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తమిళ సాహిత్యానికి ఇది గర్వకారణమని వెల్లడించారు.

మళ్లీ చర్చలో మీటూ

వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు ప్రకటించడంతో, గౌరవం – బాధ్యత – మహిళల ఆరోపణలపై స్పందన వంటి అంశాలపై మరోసారి పెద్ద చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా సాంస్కృతిక మరియు సినీ రంగాల్లో మీటూ ఉద్యమం ప్రభావంపై మళ్లీ దృష్టి పడుతోంది.