
హైదరాబాద్, వెలుగు : ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ పీజీ ఇన్సర్వీస్ కోటాను అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. గతంలో విడుదల చేసిన జీవో 155ని సవరించి, కొత్త జీవో 186ను తీసుకొచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో చేసినట్టుగానే క్లినికల్ పీజీ సీట్లలో 20 శాతం, నాన్ క్లినికల్ విభాగంలో 30 శాతం సీట్లను ఇన్సర్వీస్ డాక్టర్లకు కేటాయిస్తున్నట్టు జీవోలో పేర్కొన్నది. మూడేండ్ల కిందట రద్దయిన, మెడికల్ పీజీ ఇన్ సర్వీస్ కోటాను పునరుద్ధరిస్తూ నవంబర్లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతంలో ప్రభుత్వ కాలేజీలతో పాటు, ప్రైవేట్ కాలేజీల్లోనూ ఇన్సర్వీస్ కోటా ఉండేది. 2017లో రద్దు చేసిన ఈ కోటాను, ఈ ఏడాది పునరుద్ధరించి గవర్నమెంట్ కాలేజీలకే పరిమితం చేసింది ప్రభుత్వం. దీన్ని సర్వీస్లో ఉన్న డాక్టర్లు వ్యతిరేకించడంతో జీవోలో సవరణలు చేసి కొత్త జీవో జారీ చేసింది.