Bengaluru: బెంగళూరులో మూతపడుతున్న పీజీ హాస్టళ్లు.. ఒక్కసారిగా ఎందుకిలా..?

Bengaluru: బెంగళూరులో మూతపడుతున్న పీజీ హాస్టళ్లు.. ఒక్కసారిగా ఎందుకిలా..?

Bengaluru PG Crisis: ఒకప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా లాభాలను తెచ్చిపెట్టిన పేయింగ్ గెస్ట్ వ్యాపారం ప్రస్తుతం బెంగళూరులో గడ్డు పరిస్థితులను చూస్తోంది. నిరంతరం నగరంలో ఉద్యోగాల వేటలో వచ్చే లక్షల మందికి ఇది దశాబ్ధాలుగా నివాసాలుగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడ హాస్టళ్లు నిర్వహిస్తున్న ఫ్యామిలీల సంఖ్య కూడా ఎక్కువేనని తెలిసిందే. 

ఒకప్పుడు లాభదాయకంగా నడిచిన పీజీ వ్యాపారం ప్రస్తుతం మూతపడటానికి కారణం ఏంటనేది చాలా మందికి అంతుపట్టడం లేదు. ప్రస్తుతం బెంగళూరులో ప్రతి రోజూ కనీసం రెండు పీజీలు మూతపడుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఇది వేల మంది యువతకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. పీజీల్లో చేరుతున్న యువత సంఖ్య తగ్గిపోవటంతో చాలా చోట్ల 30 శాతం నుంచి 50 శాతం వరకు ఖాళీగానే బిల్డింగులు ఉంటున్నాయని వెల్లడైంది. ప్రధానంగా మార్తహల్లి, మహదేవపుర, వైట్ ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతాల్లోని పీజీ ఓనర్లు ఈ పరిస్థితుల్లో నడపలేమని చేతులెత్తేస్తున్నారు.

ప్రధానంగా ఐటీ రంగంలో గడచిన కొన్నేళ్లుగా కొనసాగుతున్న స్థబ్దత వల్ల నియామకాలు నెమ్మదించాయి. దీంతో ఫ్రెషర్లకు జాబ్స్ దొరకకపోవటంతో నగరానికి వస్తున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోయినట్లు వెల్లడైంది. చాలా మంది తమ కాలేజీ విద్య తర్వాత బెంగళూరు ఉద్యోగాల వేటకు సరైనది కాదని భావించటం కూడా నగరానికి వస్తున్న వారి సంఖ్యను తగ్గిస్తోందని తేలింది. అలాగే మరికొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని వాడుకుంటూ తమ స్వగ్రామాల్లోని ఇళ్లకే పరిమితం కావటం కూడా ఆక్యుపెన్సీని తగ్గించింది.

ఇదే క్రమంలో ప్రభుత్వం పీజీల నిర్వహణకు కఠినమైన నిబంధనలు తీసుకురావటం కూడా పీజీల మూతకు మరో కారణంగా తెలుస్తోంది. బీబీఎంపీ కార్పొరేషన్ పీజీలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా మార్చేసింది. అలాగే మనిషికి 70 చదరపు అడుగుల నివాస స్థలం ఉండాలని చెప్పింది. ఇక ఫైర్ సేఫ్టీ, సీసీ టీవీలు, శుభ్రతపై ఆడిట్ తప్పనిసరిగా మార్చింది. మనిషికి రోజుకు 135 లీటర్ల నీరు అందించాలని కూడా సూచించింది. హాస్టల్ మెస్ నిర్వహణకు ఫుడ్ లైసెన్స్ తప్పనిసరిగా మార్చింది. ఇక చివరిగా 40 ఫీట్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న రోడ్లకు పక్కన ఉన్న పీజీలను క్లోజ్ చేయాలని కూడా చెప్పటంతో పేయింగ్ గెస్ట్ వ్యాపారం ప్రస్తుతం నిర్వహణ అసాధ్యంగా మారిందని చాలా మంది ఓనర్లు చెబుతున్నారు. 

ప్రస్తుతం భృహత్ బెంగళూరు రికార్డుల ప్రకారం బెంగళూరు నగరంలో 2వేల 500 రిజిస్టర్ అయిన పీజీలు ఉన్నాయి. కానీ అనదికారికంగా వీటి సంఖ్య 10వేలకు పైనే ఉంటుందని అంచనా. ప్రస్తుత సమయంలో పెరుగుతున్న విద్యుత్ బిల్లులు, లైసెన్స్ ఫీజులు, రక్షణ సామాగ్రి ఫిట్టింగ్, తగ్గుతున్న ఆక్యుపెన్సీ వంటి సమస్యలు యజమానులను నిరుత్సాహపరుస్తున్నాయి. దశాబ్ధాలుగా ఐటీ రంగంలో మెుదటి జాబ్ కోసం చాలా మంది యువత అక్కడికి వెళ్లిన రోజుల నుంచి ప్రస్తుతం యువత ఎక్కువగా రాని రోజులకు దిగజారాయి పరిస్థితులు. ప్రస్తుతం కేవలం పెద్ద పెద్ద పీజీల ఓనర్లు మాత్రమే అతికష్టం మీద వ్యాపారం కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.