10 లక్షలకే కిలో బంగారమంటూ ఫోన్ కాల్

10 లక్షలకే కిలో బంగారమంటూ ఫోన్ కాల్

ఫోన్​ చేసి కర్నాటకకు పిలిపించి మోసం

ఏడాది క్రితం మోసగాళ్ల వలలో పడిన ఇద్దరు

ఇప్పుడు ట్రాప్​ చేసి నిందితులను పట్టుకున్నరు

నారాయణపేట, వెలుగు: పొలంలో బంగారం దొరికిందని.. కిలో రూ. 10 లక్షలకే ఇస్తామంటూ నమ్మించి మోసం చేస్తున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. గత ఏడాది నిందితుల చేతుల్లో ఇద్దరు మోసపోయారు. ప్రస్తుతం వారికి వచ్చినట్లుగానే మరొకరికి ఫోన్​రావడంతో పోలీసుల సాయంతో నిందితులను ట్రాప్​చేశారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఏడాది క్రితం నారాయణపేటకు చెందిన ఓ వ్యక్తికి గుర్తుతెలియని నంబర్​నుంచి ఫోన్​వచ్చింది. నా ఫ్రెండ్​ మీ నంబర్​ఇచ్చాడు.. మీతో సీక్రెట్​గా మాట్లాడాలి.. విషయం ఎవరికీ చెప్పవద్దంటూ మాట తీసుకున్నాడు. పొలం దున్నేటపుడు తనకు భారీగా బంగారం దొరికిందని, అర్జంట్​గా డబ్బులు కావాలి. తక్కువ ధరకే బంగారం ఇస్తానంటూ చెప్పాడు. ముందు శాంపిల్​చెక్​చేసుకొమ్మని, నిజమైన బంగారం అని తేలాకే డబ్బులిచ్చి తీసుకెళ్లమని అన్నాడు. తనది కర్నాటక రాష్ట్రం శివమొగ్గ అంటూ అడ్రస్​చెప్పాడు. దాంతో కర్నాటక వెళ్లిన నారాయణపేట వాసి తాను అక్కడికి వచ్చినట్లు ఆ వ్యక్తికి ఫోన్​చేసి చెప్పాడు. దాంతో నిందితులు అతడికి చెక్​చేసుకోవాలంటూ 5 గ్రాముల బంగారం ఇచ్చారు. నమ్మకం కలిగితే కిలో బంగారం రూ.10 లక్షలకు ఇస్తామన్నారు. బంగారంతో పేటకు వచ్చిన వ్యక్తి దుకాణంలో చెక్​చేయించగా ఒరిజినల్​అని చెప్పారు. ముందుగా కిలో బంగారం కావాలని చెప్పి కర్నాటక వ్యక్తికి ఫోన్​ చేయగా ఫలానా టైంకి రమ్మన్నారు. పేట వ్యక్తి ఇంకో ఫ్రెండ్​తో కలిసి రూ.10 లక్షలు తీసుకుని శివమొగ్గకు వెళ్లారు. ఫోన్​ చేసి అక్కడికి వచ్చామని చెప్పగా ఓ అడ్రస్​కు రమ్మన్నారు. అక్కడ అనుచరులతో మాటువేసి వారిని కొట్టి రూ. 10 లక్షలు లాక్కున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించి పారిపోయారు. తన్నులు తిన్న పేటవాసులు చేసేది లేక తిరిగొచ్చారు. మోసపోయిన విషయం ఎవరికీ చెప్పకుండా తమలోనే దాచుకున్నారు.

ఏడాది తర్వాత మరొకరికి ఫోన్​

నారాయణపేటకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ ఫోన్​కాల్​వచ్చింది. గత ఏడాది మోసపోయిన వ్యక్తి, ఇతను ఫ్రెండ్స్. దాంతో నిందితుల ప్లాన్​అర్థం చేసుకున్న వీరిద్దరూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్నాటక బంగారం గ్యాంగ్​తో ఫోన్​లో టచ్​లోకి వెళ్లారు. శాంపిల్​తీసుకునేందుకు కర్నాటక వస్తున్నట్లు చెప్పారు. అక్కడ శాంపిల్​తీసుకుంటున్న సమయంలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని నేరుగా పేటకు తీసుకువచ్చారు. బంగారం పేరుతో మోసం చేసేవారిని పట్టుకున్న విషయం వాస్తవమేనని, ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని ఎస్సై చంద్రమోహన్ చెప్పారు.

For More News..

పెళ్లి రోజునే సవతి పిల్లలను చంపి ఉరేసుకున్న మహిళ

రైతు హక్కులకూ రక్షణ ఉండాలె

ప్రేమపెళ్లి చేసుకున్న బిడ్డల్ని చంపితే పరువు నిలుస్తుందా?