రూపాయికి ఎకరం ఇవ్వడంలో లాభమేంది?
శారదాపీఠానికి 2 ఎకరాల కేటాయింపుపై హైకోర్టులో పిల్
విశాఖపట్నం శారదాపీఠానికి ప్రభుత్వం కారుచౌకగా రూపాయికే ఎకరం భూమిని ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సికింద్రాబాద్కు చెందిన సీహెచ్ వీరాచారి హైకోర్టులో పిల్ వేశారు. కోకాపేట లో రెండు ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందని, ఇక్కడ ఎకరం విలువ రూ. 25 కోట్ల వరకూ ఉంటుందన్నారు. రూ. 50 కోట్ల విలువైన రెండెకరాలను రూ. 2కే ఎందుకిస్తున్నారో, దీని వెనక ఉన్న ప్రజా ప్రయోజనాలేమిటో అర్థం కావడం లేదన్నారు. భూమి ఇచ్చేందుకు జీవో 71ని ఈ ఏడాది జూన్ 22న విడుదల చేశారని, ఈ జీవోను రద్దు చేయాలని కోరారు. మత పరమైన వాటికి ఇవ్వాల్సి వస్తే టీటీడీకో, యాద్రాద్రికో ఇచ్చారంటే అర్థం ఉందని, కానీ ఆర్థికంగా బలంగా ఉన్న శారదా పీఠానికి ఇవ్వడానికి కారణం ఏమీ లేదన్నారు.