ప్రధాని పదవిపై రాహుల్ పగటి కలలు : మోడీ

ప్రధాని పదవిపై రాహుల్ పగటి కలలు : మోడీ

‘‘కొందరు వ్యక్తులు రోజుకు 10 సార్లు అద్దంలో ముఖం చూసుకుంటారు. ప్రధాని అవుతామని పగటి కలలు కంటుంటారు. కానీ తమ లోక్ సభ సీటు పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లనూ గెలిపించుకోలేరు” అని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు నిన్న మొన్నటి వరకు తనను తిడుతుండేవని, 3 దశల ఎన్నికల ‘ట్రెండ్ ’ చూశాక ఈవీఎంలను తప్పుబడుతున్నాయని ఎద్దేవా చేశారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే పిల్లలు మాట్లాడే మాదిరి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయన్నారు. బుధవారం జార్ఖండ్ లోని లోహర్ దాగాలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో నక్సలైట్లు, ఉగ్రవాదులు రెచ్చి పోయేవారని, తమ ఐదేళ్ల పాలనలో తీవ్రవాదాన్ని అణచివేశామని చెప్పారు. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని నియంత్రించేందుకు పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని ఎన్ను కోవాలని ప్రజలను కోరారు.

మతాన్ని చూడం
మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ తమప్రభుత్వం ఆదుకుంటుందని మోడీ చెప్పారు. ‘ఇరాక్లో చిక్కుకున్న 46 మంది కేరళ బిడ్డల మతాన్నిచూడలేదు. టెర్రరిస్టుల నుంచి విడిపించాం. వాళ్లు మీ కూతుళ్లు. ఈ చౌకీదార్ కూతుళ్లు కూడా” అన్నారు.‘‘పాకిస్థాన్ కు నచ్చిన భాషలోనే జవాబివ్వడం ఈ ప్రభుత్వానికి తెలుసు. టెర్రరిస్టుల సొంత భూభాగంలోకి వెళ్లి వాళ్లను నాశనం చేశాం . స్పేస్ నుంచీ దాడిచేస్తామేమోనని భయపడుతున్నారు’ అని చెప్పారు.