హర్ ఘర్ జల్ ఉత్సవ్ లో పాల్గొన్న ప్రధాని మోడీ

హర్ ఘర్ జల్ ఉత్సవ్ లో పాల్గొన్న ప్రధాని మోడీ

జల్ జీవన్ మిషన్ కింద మూడేండ్లల్లో 7 కోట్ల గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ ఆయన గోవాలో హర్ ఘర్ జల్ ఉత్సవ్ లో వర్చువల్ విధానంలో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏండ్లల్లో కేవలం 3 కోట్ల గ్రామాలకు మాత్రమే పైప్ లైన్ ద్వారా మంచినీళ్లు ఇచ్చారని మోడీ తెలిపారు. దేశం గురించి పట్టించుకోని వ్యక్తులు.. దేశ వర్తమానం, భవిష్యత్ గురించి కూడా పట్టించుకోరన్నారు. ఓ దేశాన్ని నిర్మించడం అంత ఈజీ కాదన్నారు.  

ఎక్కడైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, అయితే దేశాన్ని నిర్మించడానికి కఠోర శ్రమ తప్పనిసరి అని ప్రధాని మోడీ అన్నారు. తాము దేశ నిర్మాణ మార్గాన్ని ఎంచుకున్నామని చెప్పారు. అందుకే తాము ప్రస్తుత, భవిష్యత్తు సమస్యలను, సవాళ్ళను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని మోడీ తెలిపారు. కాగా, గోవాలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే అన్ని కుటుంబాలకు ఇంటింటికీ మంచి నీటిని అందజేయాలన్న లక్ష్యం సాకారమైనందుకు రాష్ట్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.