ద్రౌపది ముర్ముకు ప్రముఖుల శుభాకాంక్షలు

ద్రౌపది ముర్ముకు ప్రముఖుల శుభాకాంక్షలు

భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. ముర్ము నివాసానికి వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి 15వ రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు అభినందనలు చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్  తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. 


ముర్ము రాష్ట్రపతిగా గెలవడం ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనమని నేతలు అభిప్రాయపడ్డారు. కౌన్సిలర్ గా, MLA, గవర్నర్ గా సేవలు అందించి ప్రజల మెప్పుపొందిన ముర్ము..రాష్ట్రపతిగా మరింత గొప్పగా సేవలందించాలని ఆకాంక్షించారు. ముర్ముకు ఓటేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని నరేంద్రమోడీ కృతజ్ఞతలు తెలిపారు . విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన యశ్వంత్ సిన్హా కూడా ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగ పరిరక్షకురాలిగా  ఉన్నత సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.

రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు ముర్ముకు శుభాకాంక్షలు చెప్పారు. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ డ్యూబా సైతం ఆ దేశ ప్రజలు, ప్రభుత్వం తరఫున ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు.