రిషబ్ పంత్ కారు ప్రమాదంపై స్పందించిన మోడీ

రిషబ్ పంత్  కారు ప్రమాదంపై  స్పందించిన మోడీ

టీమిండియా క్రికెటర్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడటంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. రిషబ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రిషబ్ పంత్‭కు జరిగిన సంఘటనతో తాను చాలా బాధపడ్డానని.. అతడి ఆరోగ్యం త్వరగా బాగుపడాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. రిషబ్ తల్లితో ఫోన్ కాల్‭లో మాట్లాడిన మోడీ ఆమెకు ధైర్యం చెప్పారు. రిషబ్‭కు ఏ సహాయం కావాలన్నా తాము అండగా ఉంటామని చెప్పారు. 

పంత్ ప్రస్తుతం డెహ్రాడూన్‭లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రూర్కీలో తన కుటుంబాన్ని కలవడానికి వెళుతున్న పంత్ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు కాని తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ తల, వీపు, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి.  అతని ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు. దీంతో తోటి ఆటగాళ్లే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు పంత్ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. అతను త్వరగా కోలుకోవాలని సోషల్‌ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. పంత్ చికిత్సకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంది.