ప్రధాని మోడీ రోడ్ షో..కిక్కిరిసిన జనం

ప్రధాని మోడీ రోడ్ షో..కిక్కిరిసిన జనం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ రోడ్ షో  నిర్వహించారు. వాపిలోని కట్టుదిట్టమైన భద్రత నడుమ రోడ్ షోలో పాల్గొన్నారు. మోడీ రోడ్ షోలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. రోడ్డుకు ఇరు వైపులా ప్రజలు మోడీకి చేతులు ఊపారు. తనను ఉత్సాహపరుస్తున్న ప్రజలకు మోడీ చేతులు ఊపారు. మోడీ ర్యాలీతో వాపి రోడ్ జనంతో కిక్కిరిసంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. 

బీజేపీదే విజయం..
ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో  భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా గుజరాత్‌, బీజేపీ మధ్య బంధం విడదీయరానిదని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ర్యాలీ పాల్గొనడంతోనే గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో తెలిసిపోతుందన్నారు. తల్లులు, సోదరీమణులు పెద్ద సంఖ్యలో రావడం తమ అదృష్టమని చెప్పారు. ఈ జనసంద్రమే బీజేపీ విజయాన్ని చాటిచెబుతోందన్నారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన అభివృద్ధిని చూసి.. ప్రజ‌లు ఓటు వేయాల‌ని కోరారు.

రెండు రోజుల పర్యటనలో బిజీ బిజీగా..
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.  ఆదివారం ముందుగా ప్రధాని మోడీ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి..ఆ తర్వాత సౌరాష్ట్ర ప్రాంతంలో నాలుగు ర్యాలీలలో  ప్రసంగిస్తారు. వెరావల్, ధోరార్జీ, అమ్రేలి, బొటాడ్‌లో జరిగే ర్యాలీలో మోడీ పాల్గొంటారు. ఇక సోమవారం సురేంద్రనగర్‌, భరూచ్‌, నవ్‌సారిలో ప్రధాని మోడీ మూడు ర్యాలీలు నిర్వహించనున్నారు. 

గుజరాత్ అసెంబ్లీకి డిసెంబ‌ర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నిక‌లు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 182 అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రధాని మోడీ గుజరాత్ కు వెళ్లడం ఇది రెండోసారి. నవంబర్ 6న తొలిసారిగా ప్రర్యటించిన మోడీ వల్సాద్ జిల్లాలోని కప్రదాలో ర్యాలీలో ప్రసంగించారు.