మన్ కీ బాత్ కార్యక్రమంలో సిరిసిల్ల చేనేత కార్మికుడు యెల్ది హరిప్రసాద్ పై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. జీ-20 సమావేశాల్లో హరిప్రసాద్ తన చేతితో స్వయంగా నేసిన లోగోను మోడీ చూపించారు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి తాను ఆశ్చర్యపోయానని.. చేనేత కార్మికుల గొప్పదనాన్ని, కళా నైపుణ్యాన్ని వివరిస్తూ ప్రధాని అభినందించారు. హరిప్రసాద్ పంపిన ఈ బహుమతి అందుకోగానే తన మనసులో మరో ఆలోచన వచ్చిందని తెలిపారు. తెలంగాణలోని ఒక జిల్లాలో కూర్చున్న వ్యక్తి కూడా జి-20 వంటి శిఖరాగ్ర సదస్సుతో... ఎంతగా అనుసంధానమయ్యాడో చూసి తాను చాలా సంతోషించానని మోడీ చెప్పారు. ఇంత పెద్ద సమ్మిట్ని దేశం నిర్వహించడం వల్ల హృదయం ఉప్పొంగిపోయిందని హరిప్రసాద్ లాంటి చాలా మంది తనకు లేఖలు పంపారని మోడీ పేర్కొన్నారు. అదే విధంగా పూణే నుంచి సుబ్బారావు చిల్లారా, కోల్కతా నుంచి తుషార్ జగ్మోహన్ పంపిన సందేశాలను కూడా ప్రస్తావించారు.
జీ20 ప్రెసిడెన్సీ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవడం ద్వారా గ్లోబల్ గుడ్, ప్రపంచ సంక్షేమంపై దృష్టి పెట్టాలని మోడీ పేర్కొన్నారు. శాంతి లేదా ఐక్యత, పర్యావరణం పట్ల సున్నితత్వం, స్థిరమైన అభివృద్ధికి సంబంధించిన సవాళ్లకు భారతదేశం పరిష్కారాలను కలిగి ఉందని ప్రధాని తెలిపారు. జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టడం గర్వకారణంగా ఉందని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీలో భారత్ దూసుకెళ్తోందని మోడీ వివరించారు. ఇక.. 2023లో G20 సదస్సుకు భారతదేశం అధ్యక్షత వహించబోతోంది.