సైన్స్ లో ఫెయిల్యూర్ అన్న మాటే లేదన్నారు ప్రధాని మోడీ. ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషిని పొగిడారు. బెంగళూరు సమీపంలోని బయలాలులో ఉన్న ఇస్రో టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్వర్క్లో లో చంద్రయాన్-2 ప్రయోగంపై శనివారం ఉదయం మోడీ ప్రసంగించారు. భారత్ మాతాకి జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. మొదట ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ల్యాండర్ నుంచి సిగ్నల్స్ తెగిపోవడంతో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు.
రాత్రంతా శాస్త్రవేత్తల మానసిక స్థితి చూశానన్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా కష్టపడ్డారని, సైంటిస్టుల వెంటే దేశమంతా ఉందని ధైర్యం నింపారు. ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం అందరికీ ఆదర్శమన్నారు. ఈ ప్రయోగం మనల్ని మరింత దృఢపరిచిందన్నారు మోడీ. ఇస్రో చరిత్రలో ఎన్నో ఘన విజయాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికీ మన ఆర్బిటార్ చంద్రయాన్ చుట్టూ ఏడాది పాటు తిరుగుతుందని అన్నారు.


