- వికసిత్ భారత్ స్ఫూర్తిని 2024లోనూ కొనసాగిద్దాం
- మన్కీ బాత్లో ప్రధాని మోదీ పిలుపు
- ఇండియా ‘ఇన్నోవేషన్ హబ్’గా మారుతున్నది
- రామ మందిరంపై దేశంలో ఒక ఉత్సాహం నెలకొన్నది
- రామ భజనలను సోషల్ మీడియాలో షేర్ చేయండి
- శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రజల సూచన
న్యూఢిల్లీ: ‘వికసిత్ భారత్’, స్వయం సమృద్ధి స్ఫూర్తితో దేశం నిండిపోయిందని, 2024లో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రజలను కోరారు. ఇండియా ‘ఇన్నోవేషన్ హబ్’గా మారుతున్నదని, మనం ఇక ఆగేదే లేదనే వాస్తవాన్ని ఇది సూచిస్తున్నదని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతోపాటు భారతదేశం ఈ ఏడాది అనేక ప్రత్యేక విజయాలను సాధించిందని అన్నారు. ఆదివారం ‘మన్కీ బాత్’లో ప్రధాని మాట్లాడారు. ఫిట్ ఇండియా గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు, మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తదితరులు తమ ఫిట్నెస్ చిట్కాలను పంచుకున్నారు.
చరిత్రాత్మక ఘట్టంలో కళారంగం
ఆయోధ్యలోని రామ మందిరంపై దేశంలో ఒక ఉత్సాహం నెలకొందని ప్రధాని మోదీ అన్నారు. రామ మందిరంపై చేస్తున్న భజనలను సోషల్ మీడియాలో ‘శ్రీరామ భజన్’ పేరుతో షేర్ చేయాలని పిలుపునిచ్చారు. ‘‘అయోధ్య రామమందిరంపై ప్రజలు పలు రకాలుగా తమ భావోద్వేగాలను వ్యక్తపరుస్తున్నారు. శ్రీరాముడు, అయోధ్యపై ఇటీవల కొత్త పాటలు, కొత్త భజనలు రావడాన్ని మీరు గమనించే ఉంటారు. ఎంతో మంది కొత్త పద్యాలను రాస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న కళాకారులు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువ ఆర్టిస్టులు హృదయానికి హత్తుకునేలా భజనలను కంపోజ్ చేశారు. వాటిలో కొన్ని పాటలు, భజనలను నేను సోషల్ మీడియాలో షేర్ చేశాను’’ అని వివరించారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో కళారంగం తనదైన ప్రత్యేక శైలిలో భాగస్వామ్యమవుతున్నదని చెప్పారు.
‘నాటు నాటు’, ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ ప్రస్తావన
2023లో ఆస్కార్ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ గెలుచుకోవడాన్ని ప్రధాని ప్రస్తావించారు. ‘‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు దేశం మొత్తం ఆనందంతో ఉప్పొంగింది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కి కూడా ఆస్కార్ రావడం గురించి విన్నప్పుడు ఎవరు సంతోషించలేదు చెప్పండి? వీటి ద్వారా ఇండియా క్రియేటివిటీని ప్రపంచం చూసింది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ద్వారా ఎన్విరాన్మెంట్తో దేశానికి ఉన్న అనుబంధాన్ని అర్థం చేసుకున్నది’’ అని చెప్పారు.
ఫిట్నెస్ విషయంలో షార్ట్కట్స్ వద్దు: అక్షయ్ కుమార్
మన్కీబాత్లో తన ఫిట్నెస్ అనుభవాలను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పంచుకున్నారు. ‘‘నేను సహజమైన రీతిలో ఫిట్గా ఉండేందుకు ఎక్కువ మక్కువ చూపుతా. ఫ్యాన్సీ జిమ్ల కంటే.. ఈత కొట్టడం, బ్యాడ్మింటన్ ఆడడం, మెట్లు ఎక్కడం, వ్యాయామం చేయడం, మంచి ఆరోగ్యకరమైన ఆహారం తినడం నాకు ఇష్టం. ఎవరో సినీ నటుల శరీరాన్ని చూసి కాకుండా.. వైద్యుల సలహా మేరకు మీ జీవనశైలిని మార్చుకోండి.
తెరపై కనిపించినట్లుగా నటీనటులు నిజజీవితంలో ఉండరు. వాళ్లను స్క్రీన్స్పై చూపించేందుకు అనేక రకాల ఫిల్టర్లు, స్పెషల్ ఎఫెక్ట్లను వాడతారు. వాటిని చూసిన తర్వాత మనం కూడా మన శరీర ఆకృతిని మార్చుకునేందుకు షార్ట్కట్లను ఉపయోగించడం ప్రారంభిస్తాము. కానీ ఫిట్నెస్ జర్నీలో షార్ట్కట్స్ వద్దు” అని ఆయన హెచ్చరించారు.