కేదార్‌నాథ్‌లో ప్రధాని మోడీ.. రూ.3,400 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం

కేదార్‌నాథ్‌లో ప్రధాని మోడీ.. రూ.3,400 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం

ప్రధాని నరేంద్ర మోడీ కేదార్ నాథ్ ను సందర్శించారు. కేదార్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోడీ రాకతో  కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను రెండు క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో మోడీ సంప్రదాయ పహాడీ దుస్తుల్లో కనిపించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా మహిళలు తయారు చేసిన దుస్తులను ఆయన ధరించారు. ప్రధాని వెంట ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా ఉన్నారు. 

రోప్ వే  ప్రాజెక్టుకు  మోడీ శంకుస్థాపన  చేయనున్నారు.  గౌరీ కుండ్ నుంచి  కేదార్ నాథ్ , గోవింద్ ఘాట్  నుంచి హేమకుండ్ సాహిబ్ లను  కలుపుతూ రెండు కొత్త  రోప్ వే  ప్రాజెక్టులు రానున్నాయి.  3 వేల 4 వందల కోట్లతో కేంద్ర ప్రభుత్వం.. కొత్త రోప్ వే ప్రాజెక్టులను చేపడుతుంది. అలాగే అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. కాగా ప్రధాని పర్యటన నేపథ్యంలో కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ప్రాంతాల్లో భద్రతా చర్యలను పటిష్ఠం చేశారు. అన్ని చోట్లా భద్రతా సిబ్బందిని మోహరించారు. ప్రధాని రెండు రోజుల పాటు కేదార్ నాథ్ లోనే ఉండనున్నారు. 

ఆదిగురువు శంకరాచార్యుల సమాధి స్థలాన్ని కూడా మోడీ సందర్శించనున్నారు. దీంతో పాటు కేదార్‌నాథ్‌లోని మందకి అస్త పథం, సరస్వతీ అస్థి పథాలను మోడీ పరిశీలించనున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. ఆ తర్వాత బద్రీనాథ్ ధామ్‌కు చేరుకుని ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన అనంతరం రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల పురోగతిని ప్రధాని సమీక్షిస్తారు.