మూడేండ్లలో 7 కోట్ల ఫ్యామిలీలకు నల్లా కనెక్షన్లు

మూడేండ్లలో 7 కోట్ల ఫ్యామిలీలకు నల్లా కనెక్షన్లు
  •     సవాళ్లను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నం: మోడీ
  •     మూడేండ్లలో 7 కోట్ల ఫ్యామిలీలకు నల్లా కనెక్షన్లు ఇచ్చినం

పణజి: దేశాన్ని పట్టించుకోని వాళ్లు.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఆసక్తి చూపించరని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సులభమేనని, కానీ దేశాన్ని నిర్మించే బాధ్యతను బీజేపీ ఎంచుకుందని, ఇందుకు చాలా హార్డ్‌‌‌‌ వర్క్‌‌‌‌ అవసరమని చెప్పారు. గోవాలో గ్రామీణ ప్రాంతాల్లో పైప్‌‌‌‌ ద్వారా నీటి సరఫరా 100 శాతానికి చేరుకున్న నేపథ్యంలో శుక్రవారం గోవా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీడియో లింక్ ద్వారా ప్రధాని మాట్లాడారు. జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సీఎం ప్రమోద్ సావంత్ పణజిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కానీ దేశాన్ని నిర్మించాలంటే హార్డ్ వర్క్ చాలా ముఖ్యం. ప్రస్తుత, భవిష్యత్ సవాళ్లను పరిష్కరించేందుకు మేం నిరంతరం కృషి చేస్తున్నాం” అని తెలిపారు. నీటి సరఫరా చేస్తామంటూ, నీటిని సంరక్షిస్తామంటూ కొందరు పెద్ద పెద్ద హామీలిస్తారని, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు పని చేయరని పరోక్షంగా ప్రతిపక్షాలను ప్రధాని మోడీ విమర్శించారు. 

10 కోట్ల ఇండ్లకు తాగు నీళ్లు

ఎనిమిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నీటి వసతి కల్పించేందుకు ఎంతో కృషి చేసిందని ప్రధాని మోడీ అన్నారు. ‘‘ఇయ్యాల దేశంలోని 10 కోట్ల ఇండ్లకు పైప్‌‌‌‌లైన్‌‌‌‌ ద్వారా మంచి నీళ్లను సరఫరా చేస్తున్నాం. ఇంటింటికీ నీళ్లివ్వాలనే ప్రభుత్వ కార్యక్రమంలో అతిపెద్ద విజయమిది. సబ్‌‌‌‌ కా వికాస్‌‌‌‌కు గొప్ప ఉదాహరణ ఇది” అని చెప్పుకొచ్చారు. ‘‘7 దశాబ్దాల స్వతంత్ర భారతంలో.. కేవలం 3 కోట్ల ఇండ్లకు మాత్రమే నీటి కనెక్షన్ ఉన్నది. కానీ గత మూడేండ్లలో 7 కోట్ల రూరల్ ఫ్యామిలీలకు జల్ జీవన్ మిషన్ కింద నల్లా కనెక్షన్లు ఇచ్చాం” అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో నీటి భద్రత ఒకటని, ‘విక్సిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) దిశగా సాగుతున్న దేశానికి ఇది పెను సవాలుగా మారే ప్రమాదం ఉందన్నారు.