- యువతకు సూచించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
బషీర్బాగ్/మెహిదీపట్నం, వెలుగు : మొదటి సారి ఓటేస్తున్న యువత పోలింగ్లో పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విజ్ఞప్తి చేశారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన డీఆర్సీ సెంటర్ను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్తో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా అనుదీప్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలోని 15 సెగ్మెంట్లకు చెందిన ఎన్నికల సామగ్రిని రిటర్నింగ్ ఆఫీసర్లకు, స్పెషల్ ఆఫీసర్లకు అందజేశామన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం మాసబ్ ట్యాంక్లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన నాంపల్లి సెగ్మెంట్కు సంబంధించిన డీఆర్సీ సెంటర్ కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్న ఈవీఎంల వివరాలను ఆర్వో లావణ్యను అడిగి ఆయన తెలుసుకున్నారు.