నేలకొండపల్లి/ఇల్లెందు, వెలుగు : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలటీ, నేలకొండపల్లి మండలాల్లో పర్యటించిన మంత్రి చింతపల్లి నుంచి ముత్తగూడెం వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నేలకొండపల్లిలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. గతంలో వరి వేస్తే ఉరే అన్న పాలకులకు భిన్నంగా, ప్రస్తుతం సన్న వడ్ల సాగును ప్రోత్సహిస్తూ మద్దతు ధరతో పాటు అదనంగా రూ. 500 బోనస్ చెల్లిస్తున్నామని చెప్పారు.
పంటను భద్రపరుచుకునేందుకు వీలుగా రాష్ట్రంలో గోడౌన్ల కెపాసిటీని 200 శాతం మేర పెంచేలా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కోల్డ్ స్టోరేజీలను నిర్మించి అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పి.శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ పి.శ్రీజ, ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్బాబు, మున్సిపల్ చైర్పర్సన్ అనిత పాల్గొన్నారు. అనంతరం ఇల్లందు మున్సిపాలిటీలో పర్యటించి పదో వార్డులోని తడికమల్ల భాగ్యమ్మ, కోడిమల్ల లక్ష్మికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాత మున్సిపల్ సమావేశానికి హాజరై మాట్లాడారు. మంత్రి వెంట ఎమ్మెల్య్ కోరం కనకయ్య, కలెక్టర్ అంకిత్, అడిషనల్ కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు ఉన్నారు.

