మంత్రి ఎర్రబెల్లిపై పోస్టులు.. ఇద్దరిపై కేసులు నమోదు

మంత్రి ఎర్రబెల్లిపై పోస్టులు.. ఇద్దరిపై కేసులు నమోదు
  • ఒకరు సీపీఐ ఎంఎల్​లిబరేషన్ ​లీడర్​
  • మరొకరు కాంగ్రెస్ ​సోషల్ ​మీడియా ఇన్​చార్జి
  • నోటీసులు ఇచ్చిన పోలీసులు

పాలకుర్తి, వెలుగు : పంచాయతీ రాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు వ్యతిరేకంగా వాట్సాప్​లో పోస్టులు పెట్టారని బీఆర్ఎస్​ పార్టీకి చెందిన జోగు కుమార్​ ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఈనెల 21న మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పాలకుర్తి  మండల కేంద్రంలోని అంగడిలో రేకుల షెడ్​ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో సీపీఐ ఎంఎల్​లిబరేషన్​ పార్టీకి చెందిన లీడర్ ​మామిండ్ల రమేశ్​రాజా...‘దొరా ఇంతకాలం ఏం చేశారు.

ఇన్ని రోజులకు అంగడి గుర్తుకు వచ్చిందా? గతంలో..ప్రస్తుతం పాలకుర్తి ఏం అభివృద్ధి చెందింది. చర్చకు సిద్ధమా?’ అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావును నిలదీస్తూ వాట్సాప్​లోకల్​గ్రూపుల్లో పోస్టు పెట్టాడు. అలాగే మండలంలోని బొమ్మెర గ్రామానికి చెందిన కాంగ్రెస్​పార్టీ సోషల్​ మీడియా ఇన్​చార్జి కొండా శ్రీను కూడా రెండు రోజుల క్రితం మంత్రిని విమర్శిస్తూ రెండు పోస్టులను పెట్టాడు. ఓ పేపర్​లో ఎర్రబెల్లిపై వచ్చిన కథనాన్ని షేర్​ చేయడంతో పాటు  ‘మంత్రి ఇలాకాలో కబ్జా నిజమేనా? తొర్రూరు చుట్టూ ఉన్న 250 ఎకరాల భూమి గురించి మాట్లాడాలంటే భయపడుతున్న జనం. రియల్​ దందానా? లేక అబద్దపు ప్రచారమా? మంత్రి ఇలాకాలో కబ్జా నిజమేనా? అంటూ మరో పోస్ట్​పెట్టాడు. దీంతో మంత్రి ఎర్రబెల్లిపై అభ్యంతరకరంగా పోస్టులు చేస్తున్నారని ఆరోపిస్తూ కృష్ణ  అనే బీఆర్​ఎస్​ కార్యకర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఇద్దరికీ నోటీసులు ఇచ్చామని పోలీసులు చెప్పారు.