ప్రసవ వేదన.. నడక యాతన

ప్రసవ వేదన.. నడక యాతన

భద్రాచలం, వెలుగు: భద్రాచలం మన్యంలో వానలకు వాగులు పొంగడం, సరైన రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్ వచ్చే దారిలేకపోవడంతో.. పురిటి నొప్పులు పడుతున్న మహిళను మంగళవారం జెట్టిపై ఆస్పత్రికి మోసుకెళ్లారు. చర్ల మండలంలోని చత్తీస్​గఢ్ సరిహద్దుల్లో ఉన్న బోధనెల్లి పంచాయతీ కొర్కట్​పాడు గ్రామానికి చెందిన కోసికి పురిటి నొప్పులు వచ్చాయి. 

గ్రామానికి దారి లేక అంబులెన్స్ రాలేదు. దీంతో గ్రామస్తులు మంచాన్ని జెట్టిగా కట్టి, అందులో కోసిని పడుకోబెట్టి మూడు కిలోమీటర్లు అటవీమార్గంలో వాగును దాటి వచ్చారు. కొంచెం దూరం వచ్చాక ఆటోలో సత్యనారాయణపురం పీహెచ్​సీకి తీసుకెళ్లారు. ఆమెకు బీపీ ఎక్కువగా ఉండటంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లుగా సత్యనారాయణపురం పీహెచ్​సీ డాక్టర్ దివ్య నయన తెలిపారు.