నీలకంఠాపురంలో చరిత్రపూర్వ యుగపు ఆనవాళ్లు

నీలకంఠాపురంలో చరిత్రపూర్వ యుగపు ఆనవాళ్లు
  • క్రీ.పూ 1000 సంవత్సరాల నాటి ఇనుప వస్తువులు లభ్యం
  • నిర్ధారించిన పురావస్తు పరిశోధకుల బృందం

అనంతపురం: జిల్లాలోని మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామ పరిసరాల్లో ఆది మానవుని ఆనవాళ్లు వెలుగు చూశాయి. మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఇచ్చిన సమాచారంతో ఆదివారం నాడు పురావస్తు పరిశోధకుల బృందం నీలకంఠాపురం పరిసర గ్రామాల్లో జల్లెడపట్టి ఆసక్తికరమైన అనేక పురాతన ఆనవాళ్లు గుర్తించారు. ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆధ్వర్యంలోని చరిత్రకారుల బృందానికి రాతి యుగపు ఆనవాళ్లు కనిపించిన ప్రదేశాలను మాజీ మంత్రి రఘువీరారెడ్డి దగ్గరుండి చూపించారు. పోతుగుండు సమీపంలో కొత్త రాతియుగపు విసురుడు రాళ్లు తయారు చేసుకున్న గుంటలు, క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల నాటి ఇనుప యుగపు నివాస స్థంభాల గుంటలు, అదే యుగపు ముడి ఇనుము, ఇనుప తెట్టె, చిట్టెపు రాళ్లు, నలుపు-ఎరుపు మట్టి పాత్రలు, శాతవాహన కాలపు కుండ పెంకులు, పూసలు, ఇటుక రాతి ముక్కలు విస్తృతంగా కనిపిస్తున్నాయని ఈమని శివనాగిరెడ్డి, అనంతపురం పురావస్తు శాఖ సహాయ సంచాలకులు వంగాల రజిత తెలిపారు. మాజీ మంత్రి రఘువీరా రెడ్డి సూచన మేరకు బాణి గౌరమ్మ ఆలయం, మునీశ్వరస్వామి దేవాలయం వద్ద గల క్రీ.శ. 8వ శతాబ్ది నాటి మహిషమర్ధిని, క్రీ.శ.16వ శతాబ్ది సూర్య విగ్రహం, రంగస్వామి బండ మీద కొత్త రాతి యుగపు నూరుడు గుంటలు, క్రీ.శ 15వ శతాబ్ది రంగనాథస్వామి నైరూప్య శిల్పం, అభయాంజనేయ స్వామి ఆలయంలోని విజయనగర కాలం క్రీ.శ 16వ శతాబ్ది నాటి ఆంజనేయ విగ్రహాలను క్షుణ్ణంగా పరిశీలించింది పురావస్తు చరిత్రకారుల బృందం. నీలకంఠాపురం గ్రామ చరిత్ర క్రీ.పూ.4000 నుండి నిరాటంకంగా సాగిన ఆనవాళ్లు దొరికాయని తెలిపింది. నీలకంఠేశ్వరాలయం, శ్రీ సరస్వతీ ఆలయం సముదాయం, పంచముఖి ఆంజనేయ విగ్రహం, రామాయణ ఘట్ట శిల్పాలను పరిశీలించారు. వచ్చే రెండు నెలల్లో కొత్త ఆలయాల ప్రారంభం రోజున గ్రామ చరిత్రపై పుస్తకాన్ని ఆవిష్కరిస్తామని ఈ సందర్భంగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. నీలకంఠాపురం గ్రామ పరిసరాల్లో జరిపిన పురావస్తు అన్వేషణలో పురావస్తుశాఖ మాజీ సంచాలకులు డాక్టర్ పి.చెన్నారెడ్డి, నీలకంఠాపురం ఆలయ శిల్పి మంజునాథ్, పురావస్తు అన్వేషకుడు కొండిశెట్టి నాగరాజు పాల్గొన్నారు.