న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ నలుగురు కాంగ్రెస్ ఎంపీలు ఏఐసీసీ సెంట్రల్ ఎలెక్షన్ అథారిటీ(సీఈఏ) చీఫ్ మధుసూదన్కు లేఖ రాశారు. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ, పారదర్శకతపై తమకు ఆందోళనగా ఉందని, అందువల్ల ఎన్నికల బాధ్యతలను ఎలెక్టర్లకు, అభ్యర్థులకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లోక్సభ ఎంపీలు శశిథరూర్, కార్తీ చిదంబరం, ప్రద్యుత్ బర్దోలాయ్, అబ్దుల్ ఖలేకీ ఈ నెల 6న సీఈఏ చీఫ్ మధుసూదన్కు ఆ లేఖ రాశారు.
తమ డిమాండ్కు కొంతమంది తప్పుడు భాష్యం చెబుతున్నారని అన్నారు. ‘‘పార్టీ అంతర్గత వివరాలు రిలీజ్ చేయాలని మేము అడగట్లేదు. ఎలక్టోరల్ కాలేజీని నిర్ణయించే పీసీసీ ప్రతినిధుల జాబితాను.. నామినేషన్ ప్రక్రియకు ముందే విడుదల చేయాలంటున్నాం. అభ్యర్థిని ఎవరు నామినేట్ చేస్తారు, ఎవరు ఓటు వేయవచ్చన్న వివరాలు కూడా ఆ లిస్టులో ఉండాలి” అని ఆ నలుగురు ఎంపీలు డిమాండ్ చేశారు. లేదంటే, ఆ సమాచారాన్ని ఎలెక్టర్లు, అభ్యర్థులతో సేఫ్గా షేర్ చేసుకోవడానికి ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని వారు సూచించారు.