రిజర్వేషన్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటల్ని వక్రీకరించి ఫేక్ వీడియో సృష్టించిన వారికి ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. ఫేక్ వీడియోలు సృష్టించేవాళ్లకు గుణపాఠం నేర్పిస్తామన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓడిన వాళ్లే ఫేక్ వీడియోలు తయారు చేస్తారంటూ మోదీ ఫైరయ్యారు.
అమిత్ షా వీడియోను మార్ఫి్ంగ్ చేసి వైరల్ చేసింది ఎవరనేదానిపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో వేగంగా విచారణ జరుగుతోంది. ఈ వీడియోపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ లోను కేసు నమోదైంది. ఢిల్లీలోనూ కేసు నమోదు చేశారు స్పెషల్ సెల్ పోలీసులు. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మూలాల కోసం ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఆ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా మాట్లాడినట్టుగా ఉంది. అయితే, అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్టు బీజేపీ స్పష్టం చేసింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది.