
ఖైరతాబాద్, వెలుగు : రేవంత్ రెడ్డి ఏదైనా అనుకుంటే పట్టుదలతో సాధిస్తారని ఫైన్ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ దశరథ్ రెడ్డి అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సీఎం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథ్ రెడ్డి మాట్లాడుతూ.. అప్పట్లో మాసబ్ట్యాంక్లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో సీటు కోసం రేవంత్ రెడ్డి ఎగ్జామ్ రాస్తే 8వ ర్యాంకు వచ్చిందన్నారు. ఆ సమయంలో 7వ ర్యాంకు వరకే చివరి సీటును అలాట్ చేశామన్నారు.
ఫైన్ ఆర్ట్స్లో సీటు దొరికి ఉంటే అంతటితో ఆగిపోయేవాడినని తనను కలిసినప్పుడు రేవంత్ రెడ్డి చెప్పే వారని ఆయన గుర్తు చేశారు. రేవంత్ ఏ పని అయినా పట్టుదలతో సాధించి తీరతాడని కొనియాడారు. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం ప్రెసిడెంట్ ఎంవీ రమణారెడ్డి మాట్లాడుతూ.. లలిత కళల రంగానికి చెందిన కళాకారుడు సీఎం కావడం ఆర్టిస్టులందరికీ గర్వకారణమన్నారు. తెలంగాణలో లలితకళల అకాడమీ పునరుద్ధరించాలని ఆయన కోరారు.
లలిత కళా అకాడమీ రీజనల్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసి తగినంత స్థలం కేటాయించాలన్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఆర్ట్ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. 83 ఏండ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి ఇప్పటివరకు స్థలం కేటాయించలేదన్నారు. సమావేశంలో సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అజిత సురభి, జాయింట్ సెక్రటరీ గుర్రం మల్లేశం, అన్నారపు నాగేందర్, రాము మారేడు, అనంతయ్య, బైరు రఘురాం, రాజేందర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.