
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎల్.ఎల్.పి పరిశ్రమకు తలనొప్పిగా మారిందని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆరోపించింది. యాక్టివ్ నిర్మాతలంతా కలసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను కాదని ఈ ఎల్.ఎల్.పి ని ఏర్పాటు చేసుకున్నారు.. ఈ సంస్థ సినీ పరిశ్రమలో వివాదాలకు దారి తీస్తుందని ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావులు చెప్పారు. సినిమాను ప్రమోట్ చేయాలంటే ఎల్.ఎల్.పి కమీషన్ల రూపంలో డబ్బులు తీసుకొని చిన్న నిర్మాతలను మోసం చేస్తోందని వారు తెలిపారు.
గరువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. "ఈ ఎల్.ఎల్.పి అనేది 2013 లో ఏర్పడింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఉన్న కొంత మంది నిర్మాతలు దీన్ని ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశ్యం నిర్మాతకు పబ్లిసిటీ ఖర్చు తగ్గించడం. టీవీ యాడ్లు, పేపర్ యాడ్లు, హోర్డింగ్ ల మీద ఎక్కువగా ఖర్చు చేయనీయకుండా నిర్మాతకు హెల్ప్ చేయాలని సిండికేట్ లా ఏర్పాటు చేశారు కొందరు బడా నిర్మాతలు. కొన్ని చానల్స్ ను వాళ్ల గ్రిప్ లో పెట్టుకొని వాళ్లతో అగ్రిమెంట్ చేసుకొన్నారు. మేము మీకు యాడ్స్ రూపంలో ఎక్కువ డబ్బు ఇస్తామనీ, అందుకు ఆ చానల్ యాడ్ రేట్ ను తగ్గించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పటి నుండి కేవలం నాలుగు చానల్స్ కే యాడ్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే ఆ యాడ్స్ మీద వచ్చే కమీషన్ ను మాత్రం కేవలం ఆ 10, 12 మంది మాత్రమే పంచుకుంటూ వస్తున్నారు. తన సినిమా ప్రమోట్ చేసుకోవడానికి యాడ్లు ఇస్తే.. ఈ సిండికేట్ బ్యాచ్ 15 శాతం కమీషన్ తీసుకొని స్వతాహా గా లాభపడ్డరు. దీని వల్ల ఇండస్ట్రీకి కానీ అటు నిర్మాతలకు కానీ ఎలాంటి లాభం జరగలేదు" అన్నారు.
"ఆ తర్వాత కొన్ని రోజులకు ఎల్.ఎల్.పి సంస్థ టీవీ చానల్స్ కు డబ్బులు బాకీ పడింది, వాళ్లల్లో బాకీ పడి అందులో నుండి ముగ్గురిని బయటకు పంపేసి.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఉన్న అడహక్ కమిటీతో కలిసి మళ్లీ ప్రొడ్యూసర్ గిల్డ్ అని ఏర్పాటు చేశారు. అందులో బడా నిర్మాతలు, హీరోలు ఉన్నారు. ఈ గిల్డ్ ద్వారా కూడా నిర్మాతల దగ్గర కమీషన్ తీసుకొని చిన్న సినిమాలు తీసే నిర్మాతలకు భారంగా మారుతున్నారు. ఫిల్మ్ చాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ లాంటి సంస్థలు కార్మికులకు, ఇండస్ట్రీకి కొంత సాయం చేస్తారు. కానీ ఈ ఎల్.ఎల్.పి, గిల్డ్ అనేవి తమ సొంత లాభాలకు వాడుకుంటూ ఇండస్ట్రీకి క్యాన్సర్ లా మారారు అంటూ కొందరు చిన్న నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పెద్ద నిర్మాతలు మోసం చేయడం ఆపాలని లేదంటే కాలమే సమాధానం చెపుతుందని" ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు లు తెలపారు.