త్యాగాల తెలంగాణలో నిరంకుశ పాలన..ఉద్యమ చరిత్రను మరిచిపోయిన పాలకులు

 త్యాగాల తెలంగాణలో నిరంకుశ పాలన..ఉద్యమ చరిత్రను మరిచిపోయిన పాలకులు
  • ప్రభుత్వాన్ని వ్యాపార సంస్థగా మార్చిన్రు
  • నాటి ఉద్యమ స్ఫూర్తితో పోరాడితేనే భవిష్యత్తు

రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో మరెక్కడా జరగలేదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ స్థాయిలోనూ శాంతియుతంగా, ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో జరిగిన ఉద్యమం ఇదే. ఈ పోరాటంలో సబ్బండ వర్ణాలు, సకల జనులు ఒక్కటిగా ముందుకు సాగారు. అట్లా ఏర్పడిన రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతున్నది? తొమ్మిదేండ్ల కేసీఆర్​ పాలనలో అమరుల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల లక్ష్యాలు ఏమయ్యాయి? 
ఎం దరో అమరుల త్యాగాల ఫలితం, సకల జనుల పోరాట ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. దశాబ్దాలపాటు సాగిన ఉద్యమం.. స్వరాష్ట్రాన్ని సాధించుకున్నది. విచిత్రం ఏమిటంటే ఈ మొత్తం చరిత్రను అధికారపగ్గాలు చేపట్టినంక టీఆర్​ఎస్​ మరిచిపోయింది. టీఆర్​ఎస్​ ఇప్పుడు బీఆర్​ఎస్​గా మారి ఆఖరికి తనకు రాజకీయ గుర్తింపునిచ్చిన తెలంగాణ పేరును కూడా వదులుకున్నది. ప్రజా సంక్షేమాన్ని తాకట్టు పెట్టి అధికారాన్ని కుటుంబ ప్రయోజనాల కోసం, అక్రమార్జనకు వాడుకుంటున్నది. మొత్తంగా ఈ స్వార్థ పూరిత అవసరాల కోసం అధికారాన్ని వాడుకుంటున్నది. ధాన్యం కొనుగోళ్ల నుంచి  ధరణి దాకా ఏ పని చేసినా తన లాభాలను, అవసరాలను మాత్రమే చూసుకుంటున్నది. ఆఖరికి పరీక్షలు జరిపినా ప్రశ్నపత్రాలను అమ్ముకొని లాభం  పొందాలని చూసింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి రాజకీయాలను వ్యాపారంగా మార్చేసింది.  ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రజల సమస్యల మీద చర్చలేదు. పైసలు వెదజల్లి ఓట్లను కొని, ప్రతిపక్ష నాయకులను తన వైపు మలుచుకుని బీఆర్​ఎస్​ రాజకీయాలను నియంత్రిస్తున్నది. ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వ్యక్తులను, సంఘాలను, పార్టీలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నది. విషాదం ఏమిటంటే.. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా, జవాబుదారీతనంతో, నిస్వార్థంగా, త్యాగనిరతితో, సేవాదృక్పథంతో సాగిన తెలంగాణ ఉద్యమ రాజకీయాలకు విరుద్ధంగా బీఆర్​ఎస్​ వ్యవహరిస్తున్నది. ఉద్యమ విలువలకు నీళ్లు వదిలి, ఉద్యమ ద్రోహుల అండతో ప్రభుత్వాన్ని నడుపుతున్నది. పరిచయాలు పలుకుబడి లేని చిన్న సన్న రైతులు,  చిరువ్యాపారులు, చిన్న సూక్ష్మ పరిశ్రమలు, వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్న ప్రజలు నష్టపోతున్నారు. ఈ పరిణామాల ఫలితంగా ఏక వ్యక్తి కేంద్రంగా నిరంకుశపాలన తెలంగాణలో ఏర్పడింది. అసలు తెలంగాణ చరిత్రను ఒక్కసారి యాదికి తెచ్చుకుందాం. అదెట్లుండెనో.. ఎట్ల సాగిందో గుర్తుచేసుకుందాం..
- ప్రొఫెసర్​ ఎం.కోదండరాం,  టీజేఎస్​ చీఫ్

ఆధిపత్యాన్ని నిలదీసి..

ఏ అవసరాల కోసం పోరాటం సాగింది? ఏ లక్ష్యాలు మనుషులను పోరాటంలోకి తీసుకొచ్చాయి? సూక్ష్మంగా చెప్పాలంటే పోరాటం ఆంధ్ర పాలకుల పెత్తనానికి వ్యతిరేకంగా సాగింది. సెక్రటేరియెట్​లో ఆంధ్రా పాలకులకు చక్రం తిప్పే అధికారాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాధికారం ఆంధ్ర పాలకుల చేతుల్లోనే కేంద్రీకృతమవడం తెలంగాణ నాయకులను నియోజకవర్గ పరిధి దాటి ఎదగనీయలేదు. ఈ నాయకుల భవితవ్యం ఆంధ్రా నాయకత్వంతో ఉన్న సమబంధ బాంధవ్యాలను బట్టి నిర్ణయమయ్యేది. రాజకీయాధికారం లేకపోవడంతో తెలంగాణ తన వనరులపైన అధికారాన్ని కోల్పోయింది.  తెలంగాణ వనరులు ఆంధ్రా పాలకుల ఎదగడానికి ఉపయోగపడ్డాయి తప్ప తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చలేకపోయాయి. ఆంధ్రా పాలకుల పెత్తనం వల్ల తెలంగాణ తన భాషను, యాసను, సంస్కృతిని కోల్పోయింది. తన చరిత్రను తానే మరిచిపోయింది. అస్తిత్వాన్ని కాపాడుకోవడం తెలంగాణ అభివృద్ధికి కీలకమైంది. తమ  చరిత్రను తాము తెలుపుతుంటే తప్ప ఏ సమాజం కూడా ముందుకు దారి వెతుక్కోలేదు. తెలంగాణ పోరాటం అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి, వనరులపై అధికారాన్ని పొందడానికి, రాజకీయ అధికారాన్ని సాధించడానికి జరిగింది.

ప్రజా సంఘాల కృషి ఫలితంగా..! 

తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం ప్రొఫెసర్ జయశం కర్  చెప్పినట్టు మూడు దశల్లో సాగింది.  మొదటి దశలో  భావవ్యాప్తి జరిగింది. ఈ దశ 1989లో మొ దలైనా  1996 నుంచి మాత్రమే భావవ్యాప్తి విస్తృతంగా సాగింది. అనేక ప్రజా సంఘాలు ఏర్పడి 1996 తర్వాత తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ సభలు, సమావేశాలు గ్రామగ్రామాన నిర్వహించాయి. ఈ ప్రచారం 2001 దాకా విస్తృతంగా సాగింది. ప్రభుత్వ దాడులను, నిర్బంధాలను తట్టుకొని ప్రచారం చేయడం మామూలు విషయం కాదు. ఈ ప్రచార ఉద్యమాన్ని నడిపే క్రమంలో అనేకమంది ఉద్యమకారులు బూటకపు ఎన్​కౌంటర్లలో మరణించారు. 2001 దాకా ప్రజా సంఘాలు చేసిన కృషి ఫలితంగానే తెలంగాణ డిమాండ్ రాజకీయ ఎజెండా మీదికి వచ్చింది. తెలంగాణ ఏర్పడాలన్న భావన ప్రజల్లో బల పడిన తర్వాతనే ఆ ఆకాంక్షకు రాజకీయ వ్యక్తీకరణ ఇవ్వడానికి టీఆర్​ఎస్​ ఏర్పడింది. అటు తర్వాత కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ, బీజే పీ కూడా తెలంగాణ డిమాండ్​ను బలపరిచాయి. తె లంగాణ ప్రజలు, ప్రజా సంఘాలు కేవలం భౌగోళిక తెలంగాణ కాదు ప్రజాస్వామిక తెలంగాణను సాధించిపెట్టాలని అన్ని పార్టీలను డిమాండ్ చేశాయి. ఈ ఒత్తిడి టీఆర్​ఎస్​ మీద ఇంకా ఎక్కువగా ఉండేది. ఈ పరిస్థితుల్లోనే అట్టడుగు వర్గాలకే నాయకత్వం ఇస్తానని, దళిత, బహుజన వర్గాలకు న్యాయం చేస్తానని, ప్ర జల భాగస్వామ్యాన్ని పాలనలో పెంచుతానని టీఆర్​ఎస్​ ప్రకటించింది. 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర డిమాండ్ బలమైన అంశంగా నిలిచింది. తెలంగాణ డిమాండ్​ను  బలపరిచిన టీఆర్​ఎస్​, కాంగ్రెస్, వామపక్షాల కూటమి ఎన్నికల్లో గెలవడంతో తెలంగాణ అంశం ఢిల్లీకి చేరింది. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర డిమాండ్​కు గుర్తింపు లభించింది. అప్పటి నుంచి భావవ్యాప్తి ఉధృతమైంది. తెలంగాణకు జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా సాగినాయి.

ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుదాం

ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ఉద్యమం సాగిందో.. ఇప్పుడు అవి మరుగునపడ్డాయి. పాలక పక్షం బీఆర్​ఎస్.. ఉద్యమ విలువలకు విడిచిపెట్టి..  ఉద్యమ ద్రోహులతో ముందుకు నడుస్తున్నది. ఏక వ్యక్తి కేంద్రంగా నిరంకుశపాలన తెలంగాణలో ఏర్పడింది. ఈ పాలన తెలంగాణ అభివృద్ధికి ఒక కొండ వలే అడ్డంగా నిలిచింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ నిరంకుశ పాలనను కూలదోయకుండా తెలంగాణ ప్రయాణం ముందుకు సాగదు. నిరంకుశ పాలనను అంతమొందించడానికి భవిష్యత్తుకు దారి తెలంగాణ ఉద్యమాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది. తెలంగాణ ఉద్యమంలోనే మన భవిష్యత్తును దర్శించవచ్చు.