నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలె : పన్నాల హరీష్ రెడ్డి

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలె : పన్నాల హరీష్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేస్తోందని మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ఆరోపించారు. తన కుటుంబ సభ్యుల్లో ఉన్న అందరికీ పదవులు ఇచ్చి..నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని అన్నారు. మేడ్చల్ జిల్లా బీజేపీ సెక్రెటరీ విజీత్ వర్మ ఆధ్వర్యంలో మియపూర్, కూకట్ పల్లి మీదుగా అమీర్ పేట్ వరకు మెట్రో రైలులో గ్రాడ్యుయేట్లతో కలిసి భిక్షాటన చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధువులలో ఒక్కరైనా బలిదానం చేశారా..? అని ప్రశ్నించారు. 

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు సాధించే విధంగా అందరం కలిసి  కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్​ చార్జ్​ గజ్జల యోగాన, బీజేపీ, బీజేవైఎం శ్రేణులు పాల్గొన్నారు.