మంత్రి కేటీఆర్ కు సొంత ఇలాకా సిరిసిల్లలో నిరసన సెగ ఎదురయ్యింది. ఐదేళ్లయినా ఇచ్చిన హామీ నెరవేర్చలేదంటూ ప్రజలు నిరసనకు దిగారు. ఎల్లారెడ్డి పేట మండలం వెంకటాపూర్ గ్రామంలో గత ఐదు సంవత్సరాల క్రితం ప్రధాన మురికి కాలువ నిర్మిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఇంత వరకు కాలువ నిర్మించలేదు. దీంతో నిరసనకు దిగిన స్థానికులు ఈ మురికి కాలువకి మోక్షం ఎప్పుడు అంటూ ఫ్లెక్సీలు కట్టి నిరసన తెలిపారు.
‘2017 లో వెంకటాపూర్ గ్రామలో మురికి కాలువ నిర్మాణానికి కేటీఆర్ హామీ ఇచ్చి మరిచిన కేటీఆర్ . దీన్ని పట్టించుకోని అధికారులు. ఈ మురికి కాలువకి మోక్షం ఎప్పుడు కేటీఆర్’ అంటూ ఫ్లెక్సీ వేయించారు. అయితే ఈ ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నాయకులు, పోలీసులు తొలగించారు.
ఫ్లెక్సీలు తొలగించినా..తమను అరెస్ట్ చేసినా తమ నిరసన ఆగబోదని స్థానికులు తెలిపారు. కేటీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు రేపటి నుంచి నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.