భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి టెంపుల్అభివృద్ధి, గోదావరి పుష్కరాల పనులు చేపట్టే విధంగా ప్రణాళికలు రూపొందించాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పేర్కొన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆర్కిటెక్ట్ కృష్ణమూర్తితో కలిసి బుధవారం ఆమె హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ అంకిత్, భద్రాచలం టెంపుల్ ఈవో దామోదర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ సీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మొదటి దశ పనులను గోదావరి పుష్కరాల ప్రారంభం నాటికి పూర్తి చేసే విధంగా చేపట్టాలన్నారు. ఇదే క్రమంలో పుష్కరాల పనులు కొనసాగించాలన్నారు. టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి అన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ టెంపుల్ అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.
సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ నాగేశ్వరరావు, టెంపుల్డీఈ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఖమ్మం నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ విస్తరణ పనులపై ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. మెగా డిస్ట్రిబ్యూటరీ సంస్థ క్వాలిటీ ఇన్చార్జి రామకృష్ణతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పైప్లైన్ పై చర్చించారు. పైపులైన్ రూట్ మ్యాప్, ప్రస్తుత పనుల పురోగతి, ఎదురయ్యే సవాళ్లు, తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ అమలులో ఉన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు సూచించారు.
