కేయూ లేడీస్​ హాస్టళ్లలో ర్యాగింగ్..81 స్టూడెంట్లపై వేటు

కేయూ లేడీస్​ హాస్టళ్లలో ర్యాగింగ్..81 స్టూడెంట్లపై వేటు
  •     జూనియర్లను వేధిస్తున్న 81 స్టూడెంట్లపై వేటు
  •     వారం రోజులు సస్పెన్షన్

హనుమకొండ, వెలుగు :  కాకతీయ యూనివర్సిటీలోని లేడీస్​హాస్టళ్లలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. జూనియర్లను వేధిస్తున్న సీనియర్ విద్యార్థినులను వర్సిటీ అధికారులు సస్పెండ్ చేసినట్టు తెలిసింది. వీరిలో కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ డిపార్ట్మెంట్ల స్టూడెంట్లు ఉన్నారని సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. కేయూ మహిళా హాస్టళ్లలో కొద్దిరోజులుగా జూనియర్లను పరిచయ కార్యక్రమం పేరుతో సీనియర్లు వేధిస్తున్నారు.

అంతటితో ఆగకుండా వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. తట్టుకోలేకపోయిన కొందరు జూనియర్లు ఈ నెల 18న వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ప్రొఫెసర్లు రిజిస్ట్రార్ శ్రీనివాసరావుకు రిపోర్టు ఇచ్చారు. దీంతో ఆయా డిపార్ట్​మెంట్లకు చెందిన మొత్తం 81 మంది విద్యార్థినులను వర్సిటీ అధికారులు వారం రోజుల పాటు సస్పెండ్​చేశారు.

కాగా కొద్దిరోజులుగా కేయూ లేడీస్ హాస్టళ్లలో జూనియర్ లను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమై కేయూ హాస్టల్ డైరెక్టర్ వై.వెంకయ్యను వెలుగు ప్రతినిధి ఫోన్​లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేకపోవడం గమనార్హం.