- మధ్యప్రదేశ్లో 150 సీట్లు గెల్చుకుంటం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 150 సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. సోమవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎన్నికల సన్నద్ధత సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో రాహుల్తో పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ సీఎం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్, ఏఐసీసీ ఇన్చార్జ్ పీ అగర్వాల్, ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు. కర్నాటక మాదిరిగానే మధ్యప్రదేశ్లోనూ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. "మేము సుదీర్ఘంగా చర్చించాము. కర్నాటకలో మాకు 136 సీట్లు వచ్చాయి. మా అంతర్గత అంచనా ప్రకారం మధ్యప్రదేశ్లో 150 సీట్లు వస్తాయి. కర్నాటక విజయాన్నే మధ్యప్రదేశ్లోనూ పునరావృతం చేయబోతున్నాం" అని రాహుల్ చెప్పారు. కమల్ నాథ్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ఇంకా 4 నెలల సమయం ఉందని, ఇది చాలా ముఖ్యమైన మీటింగ్ అని చెప్పారు. సీనియర్ నేతలంతా హాజరయ్యారని, ఎన్నికల్లో పార్టీ అమలు చేయాల్సిన వ్యూహం, అంశాలపై చర్చించామని కమల్నాథ్ తెలిపారు.